ఉత్కంఠ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై అద్వితీయ విజయం సాధించి.. టీ20 ప్రపంచకప్లో ఘనంగా బోణీ కొట్టిన టీమ్ఇండియా రెండో మ్యాచ్కు రెడీ అయింది. క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తాచాటి సూపర్-12కు అర్హత సాధించిన నెదర్లాండ్స్తో నేడు రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నెదర్లాండ్స్.. రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పాండ్యా, కార్తీక్తో కూడిన టీమ్ఇండియా బ్యాటింగ్ను ఏమాత్రం అడ్డుకుంటుందో చూడాలి!
సిడ్నీ: దాయాది పాకిస్థాన్ను చిత్తు చేసి పొట్టి ప్రపంచకప్లో శుభారంభం చేసిన టీమ్ఇండియా.. గురువారం నెదర్లాండ్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు జట్ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కాగా.. భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నది. తదుపరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్లో టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. ఆదివారం పాకిస్థాన్తో ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో విజయ ఢంకా మోగించిన రోహిత్ సేన అదే జోరు కొనసాగించాలని చూస్తుంటే.. విరాట్ కోహ్లీ తమపై విరుచుకుపడొద్దని నెదర్లాండ్స్ కెప్టెన్ కోరుకుంటున్నాడు.
గత మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ ఈ మ్యాచ్లో ఎలా ఆడుతారనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లీ, పాండ్యా ఫుల్ ఫామ్లో ఉండగా.. అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. బౌలింగ్లోనూ భారత్కు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, అర్శ్దీప్ సింగ్తో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పేస్ విభాగం బలంగా ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. ప్రయోగాలు చేయబోయేది లేదని ఇప్పటికే బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే స్పష్టం చేశాడు. ‘ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదే. నెదర్లాండ్స్ను తక్కువ అంచనా వేయడంలేదు. ఎవరికీ విశ్రాంతి ఇవ్వదల్చుకోలేదు. టోర్నీలో ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్నాం’ అని మాంబ్రే అన్నాడు. హార్దిక్ పాండ్యా ఫిట్గా ఉన్నాడని అతడు ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడని పేర్కొన్నాడు.
చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ టీ 20 ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. పొట్టి ప్రపంచకప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై మెరుపు బ్యాటింగ్తో జట్టును గెలిపించిన కోహ్లీ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో ఐదు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంక్కు చేరుకున్నాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కోహ్లీ 53 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్ల సాయంతో అజేయంగా 82 పరుగులు చేసి జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. కాగా బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ రెండు స్థానాలు మెరుగై 10వ ర్యాంక్లో నిలువగా.. ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా మూడు స్థానాలు మెరుగై మూడో ర్యాంక్కు చేరుకున్నాడు.
ప్రపంచకప్ ఆరంభ పోరులో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో న్యూజిలాండ్ రెండొందల పరుగులు చేసింది. మరోసారి పరుగుల వరద పారే అవకాశం ఉంది. మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్నా.. సాయంత్రానికి వాతావరణం ఆటకు అనుకూలంగా ఉండనుంది.
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పాండ్యా, కార్తీక్, అక్షర్, అశ్విన్, షమీ, భువనేశ్వర్, అర్శ్దీప్.
నెదర్లాండ్స్: ఎడ్వర్డ్స్ (కెప్టెన్), డౌడ్, విక్రమ్జిత్, లీడ్, కొలిన్, కూపర్, ప్రింగ్లె, గాగ్టన్, క్లాసెన్, మీకెరెన్, షారిజ్ అహ్మద్.