Cricket World Cup | బెంగళూరు: మూడు మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన ఆస్ట్రేలియా.. టీమ్ఇండియా చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్తో అమీతుమీకి సిద్ధమైంది. ప్రపంచంలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన ఆసీస్.. ఈ సారి స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక ఇబ్బంది పడుతున్నది. తొలి పోరులో భారత్ చేతిలో ఓడిన కంగారూలు ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం ఎదుర్కొన్నారు.
రెండు ఓటముల నుంచి కోలుకొని శ్రీలంకపై విజయంతో సత్తాచాటిన ఆసీస్ అదే జోరు కొనసాగించాలని చూస్తుంటే.. రోహిత్ సేనతో మ్యాచ్లో ఎదురైన పరాజయాన్ని పక్కన పెట్టి ముందంజ వేయాలని పాకిస్థాన్ భావిస్తున్నది. వార్నర్, మార్ష్, స్మిత్, లబుషేన్, ఇంగ్లిస్, మ్యాక్స్వెల్, స్టోయినిస్ సమిష్టిగా సత్తాచాటాలని ఆసీస్ టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటుంటే.. పాకిస్థాన్ లయ అందుకునేందుకు ఇబ్బంది పడుతున్నది. ముఖ్యంగా వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ఫామ్ ఆ జట్టును కలవర పెడుతున్నది. ఈ మ్యాచ్లో అతడిని పక్కన పెట్టి మహమ్మద్ నవాజ్కు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. కెప్టెన్ బాబర్ ఆజమ్పై ఒత్తిడి ఉండనుండగా.. పాక్ బౌలింగ్ యూనిట్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరం.