IND vs WI | తొలి వన్డేలో కష్టకష్టంగా నెగ్గి.. రెండో మ్యాచ్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమ్ఇండియా నేడు విండీస్తో నిర్ణయాత్మక పోరుకు సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్లో మిడిలార్డర్ను పరీక్షించాలని భారత బృందం భావిస్తుంటే.. రెండో వన్డే ఇచ్చిన జోష్తో సిరీస్ చేజిక్కించుకోవాలని కరీబియన్లు చూస్తున్నారు. ఈ మ్యాచ్కు కూడా రోహిత్, కోహ్లీ దూరం కానుండగా.. మరి యువ ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరంగా మారింది!
టరోబా: ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న యువ ఆటగాళ్లకు మరో చక్కటి అవకాశం! మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం వెస్టిండీస్తో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. మెగాటోర్నీ సన్నాహకాల్లో భాగంగా ప్రయోగాలు కొనసాగించాలనుకుంటున్న భారత జట్టు.. ఈ మ్యాచ్లో కూడా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నది. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనుండగా.. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి వాళ్లకు మరో గోల్డెన్ చాన్స్ దక్కినట్లే. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా.. సీనియర్లు దూరమైన రెండో మ్యాచ్లో విండీస్ గెలిచింది. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. నిర్ణయాత్మక పోరులో సత్తాచాటాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ రూపంలో ఓపెనర్లు బలంగానే ఉన్నా.. మిడిలార్డర్తోనే ప్రధాన సమస్య ఎదురవుతున్నది. మరి గత మ్యాచ్ తప్పిదాలను పక్కనపెట్టి మనవాళ్లు సమిష్టిగా సత్తాచాటుతారా చూడాలి!
‘ఒకటీ, రెండు పరాజయాలు ఎదురైనా వెనక్కి తగ్గం. మేం విస్తృత స్థాయి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నాం’ అని రెండో వన్డే అనంతరం పేర్కొన్న భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మూడో మ్యాచ్లోనూ ప్రయోగాలకు పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నాడు. అందుకు తగ్గట్లే.. మ్యాచ్ జరిగే ప్రాంతానికి విరాట్ చేరుకోకపోగా.. రోహిత్ కూడా తుది జట్టులో ఉండే అవకాశాలు కల్పించడం లేదు. మరి ఈ అవకాశాన్ని సంజూ, సూర్య ఎలా ఉపయోగించుకుంటారనేది కీలకం. పుష్కర కాలం తర్వాత భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనుకుంటున్న సూర్య.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. టీ20ల్లో ప్రపంచ నంబర్వన్గా ఎదిగిన ఈ ముంబైకర్.. వన్డేల్లో పూర్తిగా నిరాశ పరుస్తున్నా.. మేనేజ్మెంట్ అతడిపై నమ్మకముంచి వరుస అవకాశలిస్తున్నది. మరి ఈ మ్యాచ్లోనైనా వాటిని సూర్య అందుకుంటాడా చూడాలి. ఇక చాన్నాళ్ల తర్వాత తుది జట్టుకు ఎంపికైన సంజూ శాంసన్ ఈ మ్యాచ్లోనైనా తన మార్క్ చూపితేనే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే చాన్స్ ఉంది. బౌలింగ్ విభాగంలోనూ అనుభవరాహిత్యం కనిపిస్తున్నది.
భారత్: పాండ్యా (కెప్టెన్), ఇషాన్, గిల్, శాంసన్, సూర్యకుమార్, అక్షర్, జడేజా, శార్దూల్, కుల్దీప్, ఉమ్రాన్, ముఖేశ్.
వెస్టిండీస్: హోప్ (కెప్టెన్), కింగ్, మయేర్స్, అథనాజ్, హెట్మైర్, కార్టీ, షెఫర్డ్, యానిక్, జెసెఫ్, మోతి, సీల్స్.
ఈ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కాగా.. నిరుడు ఇక్కడ జరిగిన టీ20లో విండీస్పై భారత్ ఘన విజయం సాధించింది. పిచ్ అటు బ్యాటింగ్కు ఇటు బౌలింగ్కు సమానంగా సహకరించనుంది. వాతావరణం మేఘావృతమై ఉండనుంది. వర్ష సూచన లేదు.