క్రైస్ట్చర్చ్: వర్షం ప్రభావం మధ్య సాగుతున్న భారత్, న్యూజిలాండ్ సిరీస్లో నేడు మూడో వన్డే జరుగనుంది. పరుగుల వరద పారిన తొలి పోరులో న్యూజిలాండ్ గెలుపొందగా.. రెండో మ్యాచ్ వర్షార్పణమైంది. ఇక ముచ్చటగా మూడో వన్డే బుధవారం క్రైస్ట్చర్చ్లో జరుగాల్సి ఉండగా.. ఈ మ్యాచ్కు కూడా వరుణుడు అడ్డుపడే అవకాశాలున్నాయి. మూడు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం న్యూజిలాండ్ 1-0తో ముందంజలో ఉంది. శిఖర్ ధవన్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్తో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా.. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్కు చాన్స్ దక్కుతుందా లేక దీపక్ హుడాకు అవకాశమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కూడా శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది. తొలి మ్యాచ్లో భారత్ నిర్దేశించిన భారీ స్కోరును ఆ జట్టు సునాయాసంగా ఛేదించింది. అలెన్, కాన్వే, విలియమ్సన్, మిషెల్, లాథమ్, ఫిలిప్స్తో కివీస్ బ్యాటింగ్లో మంచి డెప్త్ కనిపిస్తున్నది.
పిచ్, వాతావరణం
ఈ పిచ్పై పేసర్లకు సహకారం లభించడంతో పాటు.. బ్యాటర్లు నిలదొక్కుకుంటే భారీ స్కోర్లు సాధ్యమే. బుధవారం వర్ష సూచన ఉంది. ఓవర్లు కుదిస్తే.. టాస్ కీలక పాత్ర పోషించనుంది.