వన్డే ఫార్మాట్లో కంగారూలపై సిరీస్ క్లీన్స్వీప్ చేసే సువర్ణ అవకాశానికి టీమ్ఇండియా అడుగు దూరంలో నిలిచింది. స్టార్లు లేకుండానే ఆసీస్ను రెండు వన్డేల్లో చిత్తుకింద కొట్టిన భారత్.. ఆఖరి పోరులోనూ అదే జోరు కొనసాగించి వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు వైట్వాష్ మిగల్చాలని చూస్తుంటే.. విజయంతో సిరీస్కు ముగింపు పలకాలని కంగారూలు కంకణం కట్టుకున్నారు!
రాజ్కోట్: వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరిన టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాతో మూడో మ్యాచ్కు సిద్ధమైంది. ఇప్పటికే రెండు వన్డేలు నెగ్గి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. పరుగుల వరద పారే రాజ్కోట్ పిచ్పై ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరం. జోరుమీదున్న యువ ఓపెనర్ శుభ్మన గిల్తో పాటు హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని అక్షర్ పటేల్ మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదని తెలిపాడు. దీంతో ఉన్న 13 మందితోనే మ్యాచ్ ఆడుతున్నట్లు హిట్మ్యాన్ వెల్లడించాడు. రోహిత్, కోహ్లీ, పాండ్యా, కుల్దీప్ అందుబాటులో లేకపోవడంతో తొలి రెండు వన్డేలకు జట్టుకు రాహుల్ సారథ్యం వహించగా.. ఈ మ్యాచ్తో పాండ్యా తప్ప మిగిలిన ముగ్గురు బరిలోకి దిగనున్నారు. రోహిత్తో పాటు ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయనుండగా.. ఆ తర్వాత కోహ్లీ, శ్రేయస్, రాహుల్, సూర్యకుమార్ బ్యాటింగ్కు దిగనున్నారు. గత మ్యాచ్లో ఫినిషర్గా బరిలోకి దిగి దుమ్మురేపిన సూర్యకుమార్పై మరోసారి భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు పేసర్లు (బుమ్రా, సిరాజ్), ముగ్గురు స్పిన్నర్లతో (అశ్విన్, జడేజా, కుల్దీప్) భారత జట్టు బరిలోకి దిగనుంది. మరోవైపు వన్డే వరల్డ్కప్ వంటి కీలకమైన టోర్నీకి ముందు భారత్ చేతిలో వైట్వాష్ నుంచి తప్పించుకోవాలని కంగారూలు భావిస్తున్నారు. పిచ్ స్పిన్నర్లకు సహకరించే చాన్స్ ఉంది. మ్యాచ్కు వర్షం ముప్పులేదు.