టీమ్ఇండియా మరో సిరీస్పై కన్నేసింది. తొలి వన్డేలో జింబాబ్వేను చిత్తుకింద కొట్టిన రాహుల్ సేన.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. పేస్కు అనుకూలిస్తున్న పిచ్పై దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణతో కూడిన భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడం జింబాబ్వేకు శక్తికి మించిన పనిగా మారితే.. భారత ప్రధాన జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు బ్యాటర్లంతా తమ వంతు కోసం తహతహలాడుతున్నారు. గత మ్యాచ్లో శిఖర్ ధవన్, శుభ్మన్ గిల్ ఇద్దరే అజేయంగా లక్ష్యాన్ని ఛేదించగా.. అవకాశం వస్తే సత్తాచాటేందుకు లైనప్ రెడీగా ఉంది.
హరారే: ఆటగాళ్లతో పాటు అభిమానుల్లోనూ పెద్దగా హడావుడి లేకుండా సాగుతున్న జింబాబ్వే పర్యటనలో.. రెండో మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా శనివారం భారత్, జింబాబ్వే మధ్య రెండో మ్యాచ్ జరుగనుంది. తొలి పోరులో ఏకపక్ష విజయం సాధించిన టీమ్ఇండియా.. సిరీస్ పట్టేయాలని చూస్తుంటే.. ఈ మ్యాచ్లోనైనా రాహుల్ సేనకు కనీస పోటీనివ్వాలని జింబాబ్వే భావిస్తున్నది. తొలి వన్డేలో మొదట బౌలర్లు విజృంభించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగా.. ఆనక ఛేదనలో ధవన్, గిల్ చెలరేగి ఆడి వికెట్ పడకుండా జట్టుకు విజయాన్నందించారు. ప్రధాన ఆటగాళ్లు లేకున్నా.. యంగ్ ప్లేయర్లతో కూడిన టీమ్ఇండియా ఫుల్ జోష్లో ఉంటే.. ఇటీవల బంగ్లాదేశ్పై సిరీస్ నెగ్గిన జింబాబ్వే మనవాళ్లకు కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోతున్నది.
ఈ నేపథ్యంలో రాహుల్ సేన సిరీస్ విజయం నల్లేరుపై నడకలాగే కనిపిస్తున్నది. రెండో వన్డేలో రాహుల్ టాస్ గెలిస్తే.. ఆటగాళ్లందరికీ బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి. గాయం నుంచి కోలుకొని జట్టు పగ్గాలందుకున్న రాహుల్కు తొలి మ్యాచ్లో బ్యాటింగ్కు అవకాశం రాకపోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి అతడిపైనే నిలిచింది. మరోవైపు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శిఖర్ ధవన్ ‘బిందాస్’ ఇన్నింగ్స్లతో దూసుకెళ్తున్నాడు. మరోవైపు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. టీమ్ఇండియా తరఫున ఆడిన గత నాలుగు వన్డేల్లో అతడు మూడు అర్ధ శతకాలు నమోదు చేయడం గమనార్హం. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్తో బ్యాటింగ్ శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది.
దీపక్ అదే జోరు..
ఇక ఆర్నేళ్ల విరామం తర్వాత గత మ్యాచ్ బరిలోకి దిగిన దీపక్ చాహర్.. కొత్త బంతితో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. ఆర్నెళ్ల క్రితం ఎక్కడ ఆపాడో.. తిరిగి అక్కడి నుంచే ప్రారంభించిన దీపక్.. గాయం తన లయ దెబ్బతీయలేదని నిరూపించుకున్నాడు. స్వింగ్కు సహకరిస్తున్న పిచ్పై పదే పదే ఒకే చోట బంతులేస్తూ టెస్టు మ్యాచ్ తరహా బౌలింగ్తో ఫలితం రాబట్టాడు. అతడికి హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చక్కటి సహకారం అందించగా.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మూడు వికెట్లుతో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కుల్దీప్ యాదవ్ సత్తాచాటేందుకు సిద్ధమవుతుండగా.. తొలి వన్డే ఆడిన జట్టుతోనే భారత్ మరోసారి బరిలోకి దిగనుంది. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసియా కప్ కోసం సిద్ధమవుతుండగా.. వీవీఎస్ లక్ష్మణ్ ఈ టీమ్కు కోచ్గా వ్యవహరిస్తున్నాడు.