ఇండోర్: వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ సిరీస్ టీమ్ ఆదివారం రెండో వన్డే ఆడనుంది. శుక్రవారం మొహాలీలో జరిగిన తొలి పోరులో అలవోకగా గెలుపొందిన భారత్.. అదే జోరు కొనసాగించాలని చూస్తుంటే.. కంగారూలు సిరీస్ సమం చేయాలని తహతహలాడుతున్నారు. మెగాటోర్నీకి మరో పదకొం డు రోజుల గడువే ఉన్న నేపథ్యంలో.. జట్టు లయ అందుకునేందుకు ఇదే సరైన తరుణమని ఆసీస్ భావిస్తున్నది.
గత పోరులో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ నిప్పులు చెరగడంతో భారత్ విజయం నల్లేరుపై నడక కాగా.. ఈ సారి ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారో చూడాలి. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నా.. ఇటీవలి కాలంలో పెద్దగా రాణించలేకపోతున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఒత్తిడి అధికంగా ఉండనుంది. మరోవైపు కంగారూలు గత మ్యాచ్ అనుభవాలను పక్కనపెట్టి సమిష్టిగా సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు. చిన్న మైదానమైన ఇండోర్ పరుగుల వరద పారడం మాత్రం ఖాయమే.