IND vs SA | వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి నుంచి తేరుకొని స్వదేశంలో ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ నెగ్గిన టీమ్ఇండియా.. నేటి నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ టూర్లో భాగంగా మూడు ఫార్మాట్లలో సఫారీలతో తలపడనున్న భారత్.. మొదట టీ20లతో వేట షురూ చేయనుంది. వచ్చే ఏడాది జరగనున్న పొట్టి ప్రపంచకప్నకు ముందు టీమ్ఇండియా కేవలం ఆరు మ్యాచ్లు మాత్రమే ఆడనుండటంతో.. యువ ఆటగాళ్లకు ఇది కఠిన పరీక్ష కానుంది!
ఇతర దేశాలతో పోలిస్తే.. దక్షిణాఫ్రికా పిచ్లు పేస్కు మరింత అనుకూలించనున్న నేపథ్యంలో.. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరం! సీనియర్లు రోహిత్, కోహ్లీ, రాహుల్ గైర్హాజరీలో పొట్టి ఫార్మాట్కు సూర్యకుమార్ సారథ్యం వహిస్తుండగా.. యంగ్ గన్స్ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూసింగ్, జితేశ్ శర్మపై అందరి దృష్టి నిలువనుంది!
డర్బన్: సొంతగడ్డపై కంగారూలను చిత్తు చేసి టీ20 సిరీస్ చేజిక్కించుకున్న యువభారత జట్టు.. సఫారీ పర్యటనకు సిద్ధమైంది. సుదీర్ఘంగా సాగనున్న ఈ టూర్లో ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమ్ఇండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. వచ్చే ఏడాది అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. అందులో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్లకు మూడు మ్యాచ్ల ఈ సిరీస్ చక్కటి అవకాశం కానుంది.
నిరుడు టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉంటున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్కు అందుబాటులో లేకపోగా.. సూర్యకుమార్ జట్టును నడిపించనున్నాడు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భిన్నంగా ఉండే.. దక్షిణాఫ్రికా పిచ్లపై పెద్దగా అనుభవం లేని యువ ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి. అయితే పొట్టి ఫార్మాట్లో సఫారీలపై మన రికార్డు మెరుగ్గా ఉండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నది.
మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కూడా యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పించింది. రెగ్యులర్ కెప్టెన్ బవుమాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా.. మార్క్మ్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. దక్షిణాఫ్రికాకు మార్క్మ్,్ర హెన్రిక్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సన్ రూపంలో ప్రమాదకర బ్యాటర్లతో పాటు.. కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంసీ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. ఇక సొంతగడ్డపై సఫారీ పేసర్లను ఎదుర్కోవడం భారత ఆటగాళ్లకు శక్తికి మించిన పనే!
కూర్పు కష్టమే!
ఈ పర్యటన కోసం మూడు వేర్వేరు జట్లను ప్రకటించిన భారత జట్టు.. పొట్టి సిరీస్కు ఎక్కువగా యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. టీ20 సిరీస్ కోసం 17 మందిని ఎంపిక చేయగా.. ఇందులో శ్రేయస్, ముఖేశ్, ఇషాన్ మాత్రమే వన్డే సిరీస్లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారని అంతా భావిస్తున్నారు. ఓపెనర్లుగా యశస్వి, రుతురాజ్ను కొనసాగిస్తారా లేక శుభ్మన్ గిల్ కోసం ఒకరిని తప్పిస్తారా చూడాలి.
ఇక మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత సూర్య, రింకూసింగ్, జితేశ్ శర్మ, జడేజా బ్యాటింగ్కు రానున్నారు. వికెట్ కీపర్గా ఇషాన్ కంటే.. జితేశ్కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక నయా ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకుంటున్న రింకూసింగ్కు సఫారీ పిచ్లపై అసలైన సవాల్ ఎదురుకానుంది. బౌలింగ్లో సిరాజ్, కుల్దీప్, జడేజా రాకతో వైవిధ్యం పెరగగా.. ఆస్ట్రేలియాపై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన రవిబిష్ణోయ్కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.
యువ ఆటగాళ్లు మంచి జోరు మీదున్నారు. రింకూ, జితేశ్లో నిరూపించుకోవాలనే కసి ఉంది. ఇది శుభపరిణామం. విదేశీ పర్యటన అంటే కఠిన పిచ్లు ఎదురవడం మామూలే. క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొంటామనేది ముఖ్యం. అయితే ఇలాంటి పిచ్లపై ఆడిన అనుభవం మా ఆటగాళ్లకు ఉంది. జట్టులో ప్రతి ఒక్కరికీ వారి బాధ్యతలేంటో తెలుసు. సమిష్టిగా సత్తాచాటి సిరీస్ నెగ్గాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్నాం.
-సూర్యకుమార్, భారత కెప్టెన్
పిచ్, వాతావరణం
దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది. మ్యాచ్కు వర్షం ముప్పులేదు. గతంతో పోలిస్తే పిచ్ కాస్త నెమ్మదించింది. ఇక్కడ జరిగిన గత మూడు మ్యాచ్ల్లో తొలి ఇన్నింగ్స్లో 190 పై చిలుకు పరుగులు నమోదయ్యాయి. నిలదొక్కుకుంటే భారీ స్కోర్లు సాధ్యమే.
8 గత ఎనిమిదేండ్లలో దక్షిణాఫ్రికా చేతిలో టీమ్ఇండియా టీ20 సిరీస్ కోల్పోలేదు. చివరిసారిగా 2015లో భారత్పై సఫారీ జట్టు పొట్టి సిరీస్ గెలిచింది.
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వి, రుతురాజ్/గిల్, శ్రేయస్, రింకూసింగ్, జితేశ్, జడేజా, దీపక్ చాహర్, కుల్దీప్/రవి, సిరాజ్, ముఖేశ్.
దక్షిణాఫ్రికా: మార్క్మ్ (కెప్టెన్), హెన్రిక్స్, బ్రీట్జ్, క్లాసెన్, మిల్లర్, ఫెరిరా, జాన్సన్, కేశవ్, కోట్జీ, బర్గర్, షంసీ.