స్వదేశంలో ఎదురులేకుండా సాగుతున్న టీమ్ఇండియా.. మరో సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తుంటే.. వన్డేల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తున్నది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో సమ ఉజ్జీలుగా ఉన్న ఇరు జట్లు నేడు నిర్ణయాత్మక పోరులో తలపడనుండగా.. దాదాపు లక్ష మంది అభిమానులు మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తరలిరానున్నారు. పరుగుల వరద పారనున్న అహ్మదాబాద్లో హార్దిక్ పాండ్యా బృందం ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగి ట్రోఫీ ముద్దాడాలని ఆకాంక్షిద్దాం!
అహ్మదాబాద్: ఒకదాని వెంట ఒకటి వరుస మ్యాచ్లాడుతున్న టీమ్ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. న్యూజిలాండ్పై వన్డే సిరీస్ క్లీన్స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్ ఖాతాలో వేసుకునేందుకు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ చెరో మ్యాచ్ నెగ్గగా.. బుధవారం ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక పోరు జరుగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంలో జరుగనున్న పోరును ఆస్వాదించేందుకు అభిమానులు ఉత్సుకతతో ఎదురుచూస్తుండగా.. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు సహకరించనుంది. ఈ సిరీస్ నుంచి సీనియర్లకు విశ్రాంతినివ్వగా.. శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ వంటి యువ ఆటగాళ్లతో భారత జట్టు బలంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచకప్ జరుగనుండగా.. ఈ మధ్య కాలంలో భారత్ మరో టీ20 సిరీస్ ఆడేది లేదు.
దీంతో యువ ఆటగాళ్లు తమను నిరూపించుకునేందుకు ఇదే చివరి అవకాశం కానుంది. త్వరలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా.. ఆ తర్వాత ఐపీఎల్ జరుగనుంది. ఈ నేపథ్యంలో గిల్, ఇషాన్, త్రిపాఠి తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటేందుకు ఇది చక్కటి చాన్స్ కానుంది. బౌలింగ్లో భారత్కు మరోసారి ఇబ్బందులు తప్పేట్లు కనిపించడం లేదు. గత మ్యాచ్లో స్పిన్నర్లు సత్తాచాటగా.. అంతకుముందు రాంచీ వేదికగా జరిగిన పోరులో పేసర్లు తేలిపోయారు. బుమ్రా, షమీ, సిరాజ్ గైర్హాజరీలో అర్ష్దీప్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అప్పటి వరకు బాగానే బౌలింగ్ చేసిన ఈ యార్కర్ స్పెషలిస్ట్.. చివరి ఓవర్లో ధారాళంగా పరుగులిచ్చి జట్టును కష్టాల్లోకి నెట్టాడు. పాండ్యా, అర్ష్దీప్, ఉమ్రాన్, శివమ్ మావి సమిష్టిగా సత్తాచాటాల్సిన అవసరముంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో పాటు ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా అందుబాటులో ఉండటం భారత్కు కలిసి రానుంది. మరోవైపు వన్డే సిరీస్లో వైట్వాష్కు గురైన న్యూజిలాండ్ పొట్టి ఫార్మాట్లోనైనా సిరీస్ నెగ్గి సగర్వంగా దేశానికి తిరుగు పయనం కావాలని చూస్తున్నది.
తుది జట్లు (అంచనా)
భారత్: పాండ్యా (కెప్టెన్), గిల్, ఇషాన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్, దీపక్ హుడా, సుందర్, శివమ్ మావి, కుల్దీప్, ఉమ్రాన్, అర్ష్దీప్.
న్యూజిలాండ్: శాంట్నర్ (కెప్టెన్), అలెన్, కాన్వే, చాప్మన్, ఫిలిప్స్, మిషెల్, బ్రాస్వెల్, సోధి, ఫెర్గూసన్, జాకబ్, టిక్నర్.
పిచ్, వాతావరణం
అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు సహకరించనుంది. ఇక్కడ గతంలో జరిగిన మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్కు వర్ష సూచనలేదు.