తొలి మ్యాచ్లో భారత ఏస్ పేసర్ బుమ్రా ఇంగ్లిష్ ఆటగాళ్లను అల్లాడిస్తే.. రెండో పోరులో టాప్లే దానికి బదులు తీర్చుకున్నాడు. అచ్చంగా యాక్షన్ రీప్లేలా సాగిన రెండు మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరోటి గెలుచుకోగా.. ఇక నిర్ణయాత్మక మూడో వన్డేకు వేళైంది. భారత్, ఇంగ్లండ్ మధ్య నేడు ఆఖరి పోరు జరుగనుంది. బౌలర్లు విజృంభిస్తున్నా.. బ్యాటర్ల నిలకడలేమి రెండు జట్లను కలవరపెడుతున్నది. పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్తోనైనా ఫామ్లోకి వస్తాడా చూడాలి!
మాంచెస్టర్: ఇటీవల ముగిసిన టీ20 సిరీస్లో ఇంగ్లండ్ను మట్టికరిపించి ట్రోఫీ చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. వన్డే సిరీస్ కైవసం చేసుకునేందుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్లు ఒక్కో వన్డే నెగ్గగా.. నిర్ణయాత్మక మూడో పోరు ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరుగనుంది. ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్ను 2-2తో డ్రా చేసుకున్న భారత జట్టు, టీ20ల్లో 2-1తో ముందంజలో నిలిచింది. ఇక ఈ ఒక్క వన్డే నెగ్గితే.. భారత్ పరాజయం లేకుండా ఇంగ్లండ్ పర్యటన ముగించనుంది. అయితే కీలక పోరుకు ముందు బ్యాటర్ల నిలకడలేమి మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది.
తొలి మ్యాచ్లో బౌలర్లు అద్వితీయ ప్రదర్శన కనబర్చి.. ప్రత్యర్థిని వంద పరుగుల వద్దే ఆలౌట్ చేయడంతో మన బ్యాటర్లు వికెట్ కోల్పోకుండా సునాయాసంగా లక్ష్యాన్ని చేధించారు. అదే లార్డ్స్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో ఒక దశలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందనుకుంటే.. ఆఖర్లో పట్టు వదలడంతో ఇంగ్లండ్ మంచి స్కోరు చేయగలిగింది. మోస్తరు ఛేదనలో టీమ్ఇండియా ఘోరంగా విఫలమైంది. రోహిత్, ధవన్, విరాట్, పంత్, సూర్యకుమార్.. ఇలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో రోహిత్సేన వంద పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ తప్పులు సరిచేసుకొని ఆల్రౌండ్ ప్రదర్శనతో విజృంభించాలని భారత్ చూస్తుంటే.. సొంతగడ్డపై ఇప్పటికే పొట్టి సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్.. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని భావిస్తున్నది.
కోహ్లీ రాణించేనా!
గత మ్యాచ్లో ఆడిన ప్లేయర్లతోనే ఇరు జట్ల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బుమ్రా, షమీ అదరగొడుతుండటంతో మూడో పేసర్గా ప్రసిద్ధ్ కృష్ణకు బదులు.. బ్యాటింగ్లోనూ ఓ చెయి వేయగల శార్దూల్ ఠాకూర్కు అవకాశం దక్కుతుందా చూడాలి. రోహిత్, ధవన్ ఓపెనింగ్ చేయడం ఖాయం కాగా.. కెరీర్లో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో ఉన్న విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో టన్నుల కొద్ది పరుగులు చేసిన కోహ్లీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఏదుర్కొంటుండగా.. ఈ మ్యాచ్లోనైనా అతడు తిరిగి ఫామ్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సూర్యకుమార్, రిషబ్ పంత్ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్లు ఆశిస్తున్నది. హార్దిక్ పాండ్యా ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్లో రాణిస్తూ.. ఆల్రౌండర్ అనే పదానికి న్యాయం చేస్తున్నాడు. ఎటొచ్చి వీళ్లంతా సమిష్టిగా రాణించకపోవడమే అసలు సమస్య. మరోవైపు పరిమిత ఓవర్ల కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాక.. తన బ్యాటింగ్ మెరుపులకు దూరమైన జోస్ బట్లర్ ఆఖరి పోరులో దంచి కొట్టి తొలి సిరీస్ విజయం రుచి చూడాలనుకుంటున్నాడు. మరింకెందుకు ఆలస్యం హోరాహోరీ పోరు చూసేందుకు మీరు సిద్ధమైపోండి.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ధవన్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, పాండ్యా, జడేజా, షమీ, బుమ్రా, చాహల్, ప్రసిద్ధ్ /శార్దూల్.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), రాయ్, బెయిర్స్టో, రూట్, స్టోక్స్, లివింగ్స్టోన్, మోయిన్ అలీ, డేవిడ్ విల్లే, ఎవర్టన్, బ్రైడన్, టాప్లే.