Tim Southee | రెండేండ్ల క్రితం కేన్ విలియమ్సన్ చేతుల నుంచి న్యూజిలాండ్ టెస్టు జట్టు పగ్గాలను చేపట్టిన టిమ్ సౌథీ.. ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. స్వదేశంలో ఆస్ట్రేలియాపై వరుసగా రెండు టెస్టులలో ఓడి సిరీస్ను 0-2తో ఆస్ట్రేలియాకు అప్పగించిన తర్వాత అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దీనిపై సౌథీ అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ అతడు కెప్టెన్గా తన చివరి టెస్టు ఆడేశాడని న్యూజిలాండ్ క్రికెట్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
2022 డిసెంబర్లో కేన్ మామ టెస్టు జట్టు సారథ్య బాధ్యతలను సౌథీకి అప్పజెప్పాడు. ఈ రెండేండ్ల కాలంలో 12 టెస్టులలో సారథిగా ఉన్న సౌథీ.. పాకిస్తాన్తో పాటు ఇంగ్లండ్తో సిరీస్ను డ్రా చేసుకున్నాడు. శ్రీలంకతో సిరీస్ను గెలవగా బంగ్లాదేశ్తో సిరీస్ కూడా డ్రా అయింది. ఇటీవల సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్ను గెలుచుకున్న కివీస్.. ఆసీస్తో మాత్రం వైట్ వాష్ అయింది. కివీస్ జట్టు ఈ ఏడాది అక్టోబర్లో భారత పర్యటనకు రానుంది. ఈ సిరీస్లో సౌథీ సారథిగా ఉండటం కష్టమే అని సమాచారం. కెప్టెన్సీ ఒత్తిడి అతడి బౌలింగ్ మీద కూడా స్పష్టంగా ఉంది. ఆస్ట్రేలియాతో రెండు టెస్టులలో సౌథీ తీసిన వికెట్లు 4 మాత్రమే.
Chatting cricket! Tim Southee and Kane Williamson as they get set to play their 100th Tests on Friday at Hagley Oval 🏏 #TimKane100 #NZvAUS pic.twitter.com/oldqnb8eF4
— BLACKCAPS (@BLACKCAPS) March 6, 2024
వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టెస్టులో సౌథీ నేతృత్వంలోని కివీస్.. ఒకదశలో ఆసీస్ 80/5గా ఉన్నప్పటికీ మ్యాచ్ను చేజేతులా జారవిడుచుకుంది. ఆసీస్ బ్యాటర్లు అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్ ల పోరాటంతో కంగారూలు అద్భుత విజయాన్ని అందుకున్నారు.