హార్సెన్స్(డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్, ఉబర్ కప్ టోర్నీల్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పోటీల తొలి రోజు శుక్రవారం జరిగిన థామస్కప్లో భారత్ 4-1 తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది. తొలుత జరిగిన పురుషుల సింగిల్స్లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ 21-18, 19-21, 19-21తో విక్టర్ లాయ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. గంటా 11 నిమిషాల పాటు సాగిన పోరులో లక్ష్యసేన్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయాడు.
ఆ తర్వాత పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి ద్వయం 21-10, 21-11తో జొనథాన్ బింగ్, కెవిన్ లీపై అలవోక విజయం సాధించింది. ప్రత్యర్థి జోడీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ సాత్విక్, చిరాగ్ వరుస గేముల్లో చిత్తు చేశారు. ఇటీవల ఆసియా చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచిన ఆయూష్ శెట్టి 21-13, 21-17తో బ్రియాన్ యాంగ్పై గెలిచాడు.
మరో డబుల్స్లో హరిహరణ్, ఎమ్ఆర్ అర్జున్ ద్వయం 21-7, 21-15తో అలెగ్జాండర్ లిండెమన్, నైల్ యకురా జోడీని ఓడించింది. చివర్లో జరిగిన పురుషుల సింగిల్స్లో సీనియర్ షట్లర్ శ్రీకాంత్ 21-17, 21-12తో జోషువా న్యుగెన్పై గెలువడంతో భారత్కు భారీ విజయం ఖరారైంది. మరోవైపు మహిళల ఉబర్కప్లో భారత్ 2-3తో డెన్మార్క్ చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్లో పీవీ సింధు 21-13, 18-21, 21-17తో క్రిస్టోఫ్రెసన్పై గెలిచింది.