భారత జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లీ చాలా దారుణమైన ఫామ్లో ఉన్నాడు. పరుగుల యంత్రం అని పేరు తెచ్చుకున్న అతను.. ఇప్పుడు పరుగులు చేయడానికి ముప్పుతిప్పలు పడుతున్నాడు. అతను సరిగా ఆడకపోయినా ఎలాగోలా ఐపీఎల్లో తన జట్టు కష్టపడి క్వాలిఫైయర్2 వరకూ వచ్చింది.
అలాంటి కీలక మ్యాచ్లో కూడా కోహ్లీ విఫలమయ్యాడు. కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ప్రతి ఆటగాడూ తన కెరీర్లో కొంత కాలం ఫామ్ లేమితో బాధ పడతాడని చెప్పాడు.
అదే సమయంలో కోహ్లీకి లక్ కలిసి రాకపోయినా.. అతను చాలా తప్పులు కూడా చేశాడని అన్నాడు. ‘‘మనం ఫామ్లో లేనప్పుడు ప్రతి బంతినీ మిడిల్ చేయడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ఓవర్లో కొన్ని బంతులు వదిలేసిన కోహ్లీ.. రెండో ఓవర్లో బంతి వెనుకే వెళ్లి అవుటయ్యాడు. ఒక్కోసారి మనకు అదృష్టం కలిసొస్తుంది. కానీ అతనికి అలా జరగలేదు. అవుటయ్యాడు.
అసలు మనకు తెలిసిన కోహ్లీ ఇతను కాదు. ఈ సీజన్లో ఎవరో కొత్త కోహ్లీ ఆడినట్లున్నాడు‘‘ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ ఒక్క సీజన్లో కోహ్లీ చేసిన తప్పులు.. అతను పూర్తి కెరీర్లో చేసిన వాటికన్నా ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.
పరుగులు చేయలేకపోతున్నప్పుడు రకరకాలుగా ప్రయత్నిస్తామని, అప్పుడు అలాగే రకరకాలుగా అవుటవుతామని చెప్పిన సెహ్వాగ్.. ఈ సీజన్లో కోహ్లీ మాత్రం ఎన్ని రకాలుగా అవుటవ్వొచ్చో అన్ని రకాలుగు వికెట్ పారేసుకున్నాడని అన్నాడు.
‘‘క్వాలిఫైయర్లో అతను ఎదుర్కొన్న బంతిని వదిలేసి ఉండొచ్చు. లేదా గట్టిగా కొట్టి ఉండొచ్చు. కానీ ఏది చేయకుండా ఆర్సీబీ అభిమానులను, తన అభిమానులను కూడా డిసప్పాయింట్ చేశాడు‘‘ అని విమర్శించాడు.