దుబాయ్: టీ20 వరల్డ్కప్ తర్వాత ఇండియన్ టీమ్ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విరాట్ కోహ్లి ( Virat Kohli ) అందరికీ షాకిచ్చిన విషయం తెలుసు కదా. దీనికి సంబంధించి గురువారం సాయంత్రం తన సోషల్ మీడియాలో పెద్ద ప్రకటనే జారీ చేశాడు. గత 8-9 ఏళ్లుగా తనపై విపరీతంగా పని భారం పెరిగిపోయిందని, ఐదారేళ్ల నుంచి మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఈ భారం మరింత పెరిగినట్లు ఆ ప్రకటనలో కోహ్లి చెప్పాడు. అందుకే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొని టీమిండియాను టెస్ట్, వన్డే క్రికెట్లో పూర్తి సంసిద్ధతతో నడిపించాలని భావిస్తున్నట్లు కోహ్లి తెలిపాడు.
అతని ప్రకటన చాలా మందిని షాక్కు గురి చేసింది. కొందరు అతని నిర్ణయాన్ని ప్రశ్నించారు. అయితే అతని భార్య అనుష్క శర్మ మాత్రం ఈ విషయంలో కోహ్లికి మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం ఐపీఎల్ కోసం దుబాయ్లో విరాట్తోపాటు ఉన్న అనుష్క.. తన భర్త ప్రకటనను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేస్తూ ఇది తనకు నచ్చిందని చెప్పడానికి ఓ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. ఇందులో విరాట్ కోహ్లిని కూడా ట్యాగ్ చేసింది.