హైదరాబాద్, ఆట ప్రతినిధి: రెండు ఓటములతో టీజీ 20 లీగ్ను ఆరంభించిన కరీంనగర్ డైమండ్స్ ఆ తర్వాత రెచ్చిపోయి ఆడుతున్నది. వరుసగా మూడో విజయంతో ఈ టోర్నీలో ఆ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. గురువారం ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో కరీంనగర్.. 58 రన్స్ తేడాతో రంగారెడ్డి రైజర్స్ను చిత్తుచేసి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన డైమండ్స్.. గత మ్యాచ్ సెంచరీ హీరో రాహుల్ రాధేశ్ (72), హృషికేశ్ సింహ (60) మెరుపులతో 20 ఓవర్లకు 230/5 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో రంగారెడ్డి నిర్ణీత ఓవర్లలో 172/9 వద్దే నిలిచి టోర్నీలో రెండో పరాభవాన్ని మూటగట్టుకుంది.