ఎన్నో ఆశలతో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన టీమ్ఇండియా.. టెస్టు సిరీస్ విజయం సాధించి మూడు దశాబ్దాల కరువు తీరుస్తుందనుకుంటే అది అత్యాశే అయింది! ఇప్పుడు కనీసం ‘డ్రా’ అయినా చేయాలనే లక్ష్యంతో రోహిత్ సేన రెండో టెస్టుకు రెడీ అయింది. సెంచూరియన్లో సత్తాచాటలేకపోయిన పేసర్లు కేప్టౌన్లో రాణించేందుకు సిద్ధమవుతుండగా.. బ్యాటర్లు సమిష్టిగా కదం తొక్కాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. కోహ్లీ, రోహిత్, రాహుల్పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న కెప్టెన్ ఎల్గర్కు భారీ విజయంతో ఘనంగా వీడ్కోలు పలకాలని సఫారీలు చూస్తున్నారు!
కేప్టౌన్: దక్షిణాఫ్రికా పర్యటన చివరి అంకానికి చేరుకుంది. టీ20 సిరీస్ను ‘డ్రా’ చేసుకొని.. వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. ఇప్పుడు టెస్టు సిరీస్ను సమం చేసుకునేందుకు సమాయత్తమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాజయం మూటగట్టుకున్న రోహిత్ గ్యాంగ్.. బుధవారం నుంచి సఫారీలతో రెండో టెస్టు ఆడనుంది.
పేస్కు సహకరించిన సెంచూరియన్లో చేతులెత్తేసిన మనవాళ్లు.. క్లిష్టతరమైన కేప్టౌన్లో ఏం చేస్తారో చూడాలి! బాక్సింగ్డే టెస్టులో ఆతిథ్య జట్టు కేవలం 10 మంది బ్యాటర్లతోనే బరిలోకి దిగి సత్తాచాటగా.. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి కూడా మనవాళ్లు సఫారీల దరిదాపుల్లోకి చేరలేకపోయారు. గాయం కారణంగా ప్రొటీస్ కెప్టెన్ టెంబా బవుమా రెండో టెస్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఎల్గర్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు.
గత మ్యాచ్ లోపాలను సరిదిద్దుకొని సత్తాచాటేందుకు భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. తొలి మ్యాచ్లో ఘోర పరాజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయిన భారత్ ఈ మ్యాచ్లో రాణించి సిరీస్ సమం చేయడంతో పాటు.. డబ్ల్యూటీసీ పాయింట్లలో మెరుగవ్వాలని చూస్తున్నది. ఇది సాధ్యపడాలంటే మనవాళ్లు సమిష్టిగా సత్తాచాటాల్సిన అవసరముంది.
గాయం కారణంగా గత మ్యాచ్కు దూరమైన స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తుది జట్టులోకి రానుండటంతో జట్టు బలం పెరగనుంది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో జట్టుకు సమతూకం తేవడంలో జడ్డూ కీలకం కానున్నాడు. తొలి టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ కృష్ణ.. బౌన్స్ రాబట్టడంలో విఫలం కావడంతో అతడి స్థానంలో ముఖేశ్ కుమార్ను ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు తప్ప జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. టాపార్డర్లో రోహిత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరముంది.
దక్షిణాఫ్రికాలో పేలవ రికార్డు ఉన్న హిట్మ్యాన్ ఇటు బ్యాటింగ్తో పాటు.. అటు సారథిగా జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో జట్టులో కనిపించిన కసి ప్రస్తుత టెస్టు జట్టులో లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న వేళ రోహిత్ దూకుడు కనబర్చాల్సి ఉంది. ఇక యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తొందరపాటుకు పోకుండా.. మొదట క్రీజులో కుదురుకున్నాక.. ఆ తర్వాత అదునుచూసి భారీ షాట్లు ఆడటం మేలు.
శ్రేయస్ షార్ట్ పిచ్ సమస్య నుంచి బయట పడకపోతే కష్టమే. గత మ్యాచ్లో రాణించిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్పై అభిమానులు మరోసారి భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక బౌలింగ్లో బుమ్రా ఒక్కడు తప్ప మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేపోయారు. మహమ్మద్ షమీ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా.. హైదరాబాదీ సిరాజ్ మెరవాలని మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. మరోవైపు ఎల్గర్, మార్క్మ్,్ర జోర్జీ, కీగన్ పీటర్సన్, హమ్జా, వెరినే, జాన్సెన్తో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. రబడ, ఎంగ్డీ, జాన్సన్, బర్గర్ పేస్ దాడిని తట్టుకొని క్రీజులో నిలువడం భారత బ్యాటర్లకు శక్తికి మించిన పనే.
భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, జడేజా, శార్దూ ల్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్/ముఖేశ్.
దక్షిణాఫ్రికా: ఎల్గర్ (కెప్టెన్), మార్క్మ్,్ర జోర్జీ, కీగన్ పాటర్సన్, హమ్జా, బెడింగ్హామ్, వెరినె, జాన్సెన్, కేశవ్/ఎంగ్డీ, రబడ, బర్గర్.
కేప్టౌన్ పిచ్ ఆరంభంలో పేసర్లకు సహకరించనుంది. కొత్త బంతితో సీమర్లు రెచ్చిపోవడం ఇక్కడ మామూలే. మ్యాచ్ సాగుతున్నా కొద్ది బంతి స్పిన్ తిరుగుతుంది. క్రీజులో నిలదొక్కుకుంటేనే పరుగులు సాధించడం సాధ్యం. మ్యాచ్ వర్షం ముప్పులేదు.