కాలగమనంలో మరో ఏడాది కలిసిపోనుంది! ఏన్నో ఆశలతో నూతన సంవత్సరం కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. ఈ ఏడాది క్రీడారంగంలో జరిగిన ప్రముఖ సంఘటనలను ఓసారి నెమరువేసుకుంటే..
2023 Year Ender | పుష్కర కాలం తర్వాత స్వదేశలో జరిగిన వన్డే ప్రపంచకప్లో కోటి ఆశలు రేపిన టీమ్ఇండియా తుదిమెట్టుపై బోల్తా పడగా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ అదే ఫలితం ఎదురైంది! జావెలిన్లో నీరజ్ చోప్రా తనకు తిరుగులేదని నిరూపించుకుంటే.. చదరంగంలో మన గ్రాండ్మాస్టర్లు విశ్వ యవనికపై సత్తాచాటారు. ఆర్చర్లు అదుర్స్ అనిపించుకుంటే.. న్యాయం కోసం పోరాటం చేస్తూ రెజ్లర్లు ఏడాదంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు! బాక్సింగ్లో తెలంగాణ తార నిఖత్ జరీన్ తళుక్కుమంటే.. బ్యాడ్మింటన్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట కొత్త రికార్డులు నెలకొల్పింది. గ్రాండ్స్లామ్లు, సూపర్ సిరీస్లు, ఐపీఎల్ ఇలా లెక్కకు మిక్కిలి ఈవెంట్లు క్రీడాభిమానులను అలరించగా.. ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్ రూ. 24.75 కోట్లు కొల్లగొట్టి ఆశ్చర్యపరిచాడు.
నాలుగేండ్ల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారత అభిమానులకు ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా రన్నరప్తోనే సరిపెట్టుకుంది. 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్కప్ నెగ్గిన భారత్.. పుష్కర కాలం తర్వాత మన దేశంలో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీ చేజిక్కించుకుంటుంది అనుకుంటే.. అది అత్యాశే అయింది. లీగ్ దశలో ఎదురైన ప్రత్యర్థులందరినీ చిత్తుచేసిన రోహిత్ సేన్ సెమీఫైనల్లోనూ అద్వితీయ విజయం సాధించి.. ప్రపంచ చాంపియన్ హోదాకు అడుగు దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన తుదిపోరులో రోహిత్, కోహ్లీ, రాహుల్ తప్ప మిగిలినవాళ్లంతా చేతులెత్తేయడంతో టీమ్ఇండియాకు పరాజయం తప్పలేదు. అహ్మదాబాద్ స్టేడియం నీలి సంద్రాన్ని తలపించగా.. లక్షా ముప్పై వేల మంది ప్రేక్షకులను నిశబ్దంగా ఉంచడం కన్నా పెద్ద విజయం ఏముంటుందని చెప్పి మరీ బరిలోకి దిగిన ఆసీస్ సారథి కమిన్స్ అందుకు తగ్గట్లే కోట్లాది మంది అభిమానులను కన్నీట ముంచాడు. అంతకుమందు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలోనే ఓడింది.
కరోనా కారణంగా ఆలస్యంగా జరిగిన ఆసియా క్రీడల్లో మనవాళ్లు దుమ్మురేపారు. షెడ్యూల్ ప్రకారం నిరుడు జరగాల్సిన క్రీడలను మహమ్మారి కారణంగా ఈ యేడు నిర్వహించగా.. ఎప్పుడూ లేని విధంగా మనవాళ్లు పతకాల సెంచరీ కొట్టారు. అథ్లెటిక్స్ సహా అన్నీ క్రీడల్లో సత్తాచాటిన ప్లేయర్లు మొత్తం 107 పతకాలు కైవసం చేసుకున్నారు. అందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ చోప్రా తన బడిశె పదును చూపితే.. పారుల్ చౌదరి ట్రాక్పై అద్భుతాలు చేసింది. తేజిందర్ పాల్ సింగ్ తూర్ షాట్పుట్లో నయా రికార్డు నెలకొల్పితే.. తెలంగాణ గురుకుల విద్యార్థిని అగసర నందిని హెప్టాథ్లాన్లో కాంస్య పతకంతో మెరిసింది. బ్యాడ్మింటన్లో స్టార్ షట్లర్ పీవీ సింధు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోగా.. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట నమ్మశక్యం కాని విజయాలతో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ కైవసం చేసుకుంది.
హైదరాబాదీ షూటర్ ఇషాసింగ్ ఏషియన్ గేమ్స్లో నాలుగు పతకాలతో అదరగొట్టింది. బాక్సింగ్లో నిఖత్ జరీన్, ఆర్చరీలో వెన్నం జ్యోతి సురేఖ రాణిస్తే.. హాకీలో అటు పురుషుల జట్టు ఇటు మహిళల జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పరుగుల రాణి పీటీ ఉషా ఉన్న సమయంలోనే.. రెజ్లింగ్లో లైంగిక వేధింపుల అంశం అంతర్జాతీయంగా భారత పరువు తీసింది. న్యాయం కావాలంటూ స్టార్ రెజ్లర్లు రొడ్డెక్కగా.. పోలీసులు వారిని అవమానకర రీతిలో అడ్డుకున్నారు. ఎన్నెన్నో మలుపులు తిరిగిన మల్లయోధుల ‘కుస్తీ’ ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోగా.. కబడ్డీకి అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యత పెరిగింది.
రానున్న కాలంలో ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచనలు చేస్తుండగా.. ఐపీఎల్ వేలం యావత్ ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. చాన్నాళ్లుగా ఐసీసీ టైటిల్ నెగ్గాలని తహతహలాడుతున్న భారత క్రికెట్ జట్టు మరి వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లోనైనా విశ్వ విజేతగా నిలుస్తుందా చూడాలి. ఈ ఏడాది పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరగనుండగా.. ఇప్పటి నుంచే స్టార్ ప్లేయర్లంతా వాటి కోసం సన్నాహకాల్లో మునిగిపోయారు. మరింకెందుకూ ఆలస్యం మీరు కూడా మన అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పేయండి!
సౌత్ జోన్ ఆక్వాటిక్ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన జోనా శిజు ఆరు పతకాలతో అదరగొట్టింది. బెంగళూరులో జరిగిన ఈ పోటీల్లో జోనా.. ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, ఓ కాంస్యం కైవసం చేసుకుంది.
జూనియర్ నేషనల్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ చాంపియన్షిప్లో తెలంగాణ జిమ్నాస్ట్ నిష్క అగర్వాల్ పాంచ్ పటాకా మోగించింది. ఒడిశాలో జరిగిన పోటీల్లో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఓ కాంస్యం కైవసం చేసుకుంది.