సిల్హెట్: బౌలర్లు సమష్టిగా సత్తాచాటడంతో.. మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత జట్టు ఐదో విజయం నమో దు చేసుకుంది. సోమవారం థాయ్లాండ్తో జరిగిన పోరులో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో గెలిచింది. మెగాటోర్నీలో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లాడిన భారత్ ఐదింట నెగ్గి 10 పాయింట్లతో పట్టిక టాప్లో నిలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన థాయ్లాండ్ మన బౌలర్ల ధాటికి 15.1 ఓవర్లలో 37 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ నన్నాపట్ (12) మినహా ఇతర ప్లేయర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ స్నేహ్ రాణా 3.. దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ 6 ఓవర్లలో వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. సబ్బినేని మేఘన (20 నాటౌట్), పూజ (12 నాటౌట్) పనిపూర్తి చేశారు. స్టార్ ఓపెనర్ స్మృతి మందనకు ఇది 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం.