భారత క్రికెట్లోకి మరో హైదరాబాద్ ఆణిముత్యం ఆగమనం చేసింది. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న నంబూరి ఠాకూర్తిలక్వర్మ ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. చూడచక్కనైనా బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్న తిలక్వర్మ జాతీయ జట్టు నుంచి పిలుపువచ్చింది. వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన సెలెక్షన్ కమిటీ యువకులతో కూడిన టీమ్ను ఎంచుకుంది. సీనియర్లు రోహిత్శర్మ, కోహ్లీకి విశ్రాంతినిస్తూ ఐపీఎల్లో పరుగుల వరద పారించిన తిలక్వర్మతో పాటు యశస్వి జైస్వాల్కు అవకాశమిచ్చింది.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుంటూ యువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నది. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్లో ఆకట్టుకున్న క్రికెటర్ల ప్రతిభను గుర్తిస్తూ ఎంపిక చేసింది. ఆగస్టు 3వ తేదీ నుంచి వెస్టిండీస్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మందితో జట్టును ఎంపిక చేసింది. రెండు నెలల వ్యవధిలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుంటూ సీనియర్లకు ఓవైపు విశ్రాంతినిస్తూనే యువకులకు అవకాశమిచ్చింది. హైదరాబాదీ డాషింగ్ బ్యాటర్ ఠాకూర్ తిలక్వర్మ భారత టీ20 జట్టులో తొలిసారి చోటు దక్కింది.
ఇటీవల ముగిసిన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన ఈ లెఫ్ట్ హ్యాండర్ దుమ్మురేపాడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరన్నది లెక్కచేయని నైజంతో భారీ షాట్లతో విరుచుకుపడ్డ వైనం దిగ్గజాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. క్లీన్ హిట్టింగ్తో మిడిలార్డర్లో యువరాజ్సింగ్ శైలిని తలపించిన ఈ నూనుగు మీసాల యువకుడు తాజాగా టీమ్ఇండియా తలుపు తట్టాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అందరి అంచనాలకు అనుగుణంగానే తిలక్వర్మను ఎంపిక చేసింది. మొత్తంగా స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ తర్వాత హైదరాబాద్ నుంచి తిలక్వర్మ రూపంలో మరో యువ క్రికెటర్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నాడు.
ఇదిలా ఉంటే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆకట్టుకున్న ముంబైకర్ యశస్వి జైస్వాల్ జాతీయ జట్టు నుంచి పిలుపు అందింది. ఇప్పటికే టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న యశస్వి..టీ20ల్లోనూ కీలకం కానున్నాడు. రోహిత్, కోహ్లీ గైర్హాజరీలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనుండగా, సూర్యకుమార్యాదవ్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన రింకూసింగ్, జితేశ్శర్మకు జట్టులో చోటు దక్కలేదు. షమీ, సిరాజ్, బుమ్రా లేకుండానే భారత్ బరిలోకి దిగనుంది.
హార్దిక్పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్యాదవ్(వైస్ కెప్టెన్), ఇషాన్కిషన్, గిల్, యశస్వి జైస్వాల్, తిలక్వర్మ, శాంసన్, అక్షర్పటేల్, చాహల్, కుల్దీప్యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ఖాన్, ముకేశ్ కుమార్.
భారత టీ20 జట్టుకు తిలక్వర్మ ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేండ్లు తాము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఏ క్రికెటర్కైనా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడమే చిరకాల కల. అది వర్మకు ఇప్పుడు సాధ్యమైంది.
-తిలక్ తండ్రి నంబూరి నాగరాజు