ముంబై: దేశంలో అత్యంత సంపన్న క్రీడా సంస్థ అయిన బీసీసీఐ.. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రాదని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు 2018 అక్టోబర్లో తమ పాత ఉత్తర్వులను మారాస్తూ సమాచార కమిషనర్ పి.ఆర్. రమేష్ నేతృత్వంలో సోమవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద ప్రైవేట్ సంస్థగా నమోదైన బీసీసీఐ.. రాజ్యాంగం లేదా పార్లమెంట్ చట్టాల ద్వారా ఏర్పడలేదని, కాబట్టి ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(హెచ్) కింద పబ్లిక్ అథారిటీ కాదని కమిషన్ పేర్కొంది.
బోర్డుకు లభించే పన్ను మినహాయింపులను ప్రభుత్వ ఆర్థిక సహాయంగా పరిగణించలేమని తెలిపింది. బీసీసీఐపై ప్రభుత్వ నియంత్రణను బలవంతంగా రుద్దడం వల్ల ప్రస్తుత ఆర్థిక నిర్మాణంలోఅడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉందని సీఐసీ హెచ్చరించింది. ప్రభుత్వ సహాయంపై ఆధారపడే ఇతర జాతీయ క్రీడా సంఘాల మాదిరిగా కాకుండా, బీసీసీఐ స్వయంప్రతిపత్తితో మార్కెట్ శక్తులకు అనుగుణంగా నడుస్తోందని పేర్కొంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ మోడల్, మీడియా హక్కుల విధానం క్రికెట్ ఆర్థిక స్వరూపాన్నే మార్చేశాయని ప్రశంసించింది.