Women’s World Boxing Championship | పంచ్ పవర్కు వేళయైంది. ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్నకు తెరలేచింది. 65 దేశాల నుంచి 300 మందికి పైగా బాక్సర్లు తమ సత్తాచాటేందుకు సై అంటున్నారు. ముచ్చటగా మూడోసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీలో స్టార్ బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, ఒలింపిక్ విజేత లవ్లీనా బొర్గోహైపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పారిస్ ఒలింపిక్స్కు ఎలాగైనా అర్హత సాధించాలన్న పట్టుదలతో ఉన్న భారత బాక్సర్లు సొంతగడ్డపై తమ పంచ్ పవర్ ఏంటో ప్రత్యర్థులకు రుచిచూపాలనుకుంటున్నారు. వివిధ కళారూపాలతో బాక్సింగ్ టోర్నీ బుధవారం అట్టహాసంగా ప్రారంభం కాగా, నేటి నుంచి అసలు సిసలైన పోరు మొదలుకానుంది. 11 రోజుల పాటు జరుగనున్న మెగాటోర్నీలో మనోళ్లు పతకాల వేటలో సక్సెస్ కావాలని ఆశిద్దాం.
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్నకు సర్వం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 13వ ఎడిషన్ మెగా బాక్సింగ్ టోర్నీ బుధవారం అంగరంగ వైభవంగా మొదలైంది. అతిరథ మహారథుల సమక్షంలో వివిధ దేశాలకు చెందిన బాక్సర్లు జాతీయ జెండాలను చేబూని వేదికపైకి విచ్చేసారు. భారత్ తరఫున స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై మువ్వన్నెల జెండాతో అలరించారు. మూడోసారి భారత్ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో 300 మందికి పైగా బాక్సర్లు పోటీపడుతున్నారు. ఆతిథ్య భారత్ తరఫున 12 మంది బాక్సర్లు సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ముఖ్యంగా డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గోహై కచ్చితంగా పతకాలు గెలుస్తారన్న అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న పారిస్ ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని తమ విభాగాలను మార్చుకున్న నిఖత్(50కి), లవ్లీనా(75కి) ఏ మేరకు రాణిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. దిగ్గజ బాక్సర్, ఆరు సార్లు ప్రపంచ విజేత మేరీకోమ్ గాయం కారణంగా ఈసారి మెగాటోర్నీకి పూర్తిగా దూరమైంది.
మహిళల లైట్ ఫ్లై(48కి-50కి) విభాగంలో నిఖత్ జరీన్ గురువారం బరిలోకి దిగుతున్నది. తన బరువు కేటగిరీ మార్చుకున్న తర్వాత పోటీపడుతున్న రెండో టోర్నీలో నిఖత్ తన తొలి బౌట్లో అజార్బైజాన్కు చెందిన ఇస్మాయిలోవా అనకీనమ్తో తలపడుతుంది. టర్కీ వేదికగా గతేడాది జరిగిన ప్రపంచ టోర్నీలో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్ మరోమారు అలాంటి ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉంది. అయితే కీలకమైన సెమీస్, ఫైనల్స్లో రియో ఒలింపిక్స్ కాంస్య విజేత ఇంగ్రిట్ వాలెన్సియా(కొలంబియా), సుకిమి నమీకి(జపాన్) నిఖత్కు ఎదురయ్యే అవకాశముంది. తొలి రౌండ్లో సునాయాసంగా గెలిచే చాన్స్ ఉన్న నిఖత్కు ముందుకుసాగుతున్న కొద్ది తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశముంది. ఇప్పటికే ప్రపంచ, కామన్వెల్త్ చాంపియన్గా తన పంచ్ పవర్ చూపెట్టిన ఈ ఇందూరు యువ బాక్సర్ మరోమారు పసిడి ముద్దాడాలన్న కసితో ఉంది. మరోవైపు లవ్లీనా బొర్గోహైతో పాటు సవిటీ బూరకు తొలి రౌండ్లో బై లభించింది.
మెగాటోర్నీలో మొత్తం ప్రైజ్మనీ రూ.20 కోట్లుగా ప్రకటించారు. మొత్తం 12 విభాగాల్లో బాక్సర్లు పోటీపడుతారు. స్వర్ణ పతక విజేతకు రూ.82 లక్షలు, రజతానికి రూ.41 లక్షలు, కాంస్యానికి రూ. 20 లక్షల నగదు బహుమతి దక్కనుంది.