హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఐపీఎల్ తరహాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ఆదివారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో ఖమ్మం ఏసెస్ జట్టు 20 పరుగుల తేడాతో పాలమూరు స్ట్రైకర్స్ టీమ్ను ఓడించి శుభారంభం చేసింది. తొలుత ఖమ్మం 20 ఓవర్లలో 237/5 స్కోరు చేయగా.. ఛేదనలో పాలమూరు ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 217పరుగులే చేయగలిగింది.
అంతకుముందు జరిగిన ప్రారంభ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరవగా.. లీగ్ బ్రాండ్ అంబాసిడర్, హీరో విజయ్ దేరకొండ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సందడి చేశారు. టీజీ20 బీసీసీఐ అనుమతించిన అధికారిక లీగ్ అని.. ఇందులో ఆటగాళ్లు , ఫ్రాంచైజీలకు ఎలాంటి సందేహం అవసరం లేదని బోర్డు అపెక్స్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వర్ నాథ్ పేర్కొన్నారు. టోర్నీలో వరంగల్ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత క్రికెటర్ సిరాజ్ మాట్లాడుతూ.. ఇది అందరికీ చాలా పెద్ద ప్లాట్ఫామ్ అన్నాడు. ఆ తర్వాత తమన్ ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.