హైదరాబాద్, ఆట ప్రతినిధి: మధ్యప్రదేశ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు కొనసాగుతున్నది. శుక్రవారం రాష్ర్టానికి స్వర్ణం సహా మూడు కాంస్య పతకాలు దక్కాయి. బాలుర బ్యాడ్మింటన్ ఫైనల్లో యువ షట్లర్ లోకేశ్రెడ్డి 21-19, 15-21, 22-20తో అభినవ్(పంజాబ్)పై అద్భుత విజయం సాధించాడు. మూడు గేమ్ల పాటు సాగిన పోరులో అభినవ్పై లోకేశ్దే పైచేయి అయ్యింది. తొలి గేమ్ను కైవసం చేసుకుని జోరుమీద కనిపించిన లోకేశ్కు రెండోగేమ్లో పంజాబ్ షట్లర్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. నిర్ణయాత్మక మూడో గేమ్లో ఏమాత్రం అవకాశమివ్వని లోకేశ్ మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. మరోవైపు బాలుర 1500మీటర్ల రేసులో యువ అథ్లెట్ సుమిత్ కుమార్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. బాలుర బాక్సింగ్ సెమీస్లో జాదుమనిసింగ్ చేతిలో ఓడిన రాష్ట్ర యువ బాక్సర్ బిలాల్ కాంస్యంతో సంతృప్తిపడ్డాడు. బాలికల బాక్సింగ్ సెమీస్లో వింతి(మధ్యప్రదేశ్) చేతిలో ఓడిన నిధి కాంస్యానికి పరిమితమైంది.