Telangana | తెలంగాణలో ప్రతిభకు కొదువలేదు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించే యువత మన సొంతం. పోరాడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో మన కలలు సాకారమవుతున్న వేళ.. క్రీడాలోకంలో తెలంగాణ తారలు తళుక్కుమంటున్నాయి. ఆకాశమే హద్దు అన్నట్లు అద్భుత ప్రతిభ కనబరుస్తూ అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేస్తున్నారు. తాము ఎంచుకున్న క్రీడల్లో ప్రపంచాన్ని జయిస్తూ పతకాల పంటపండిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని పుణికిపుచ్చుకుంటూ అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. దశాబ్ది ఉత్సవాల వేళ రాష్ట్ర ప్రతిష్ఠను పతాక స్థాయికి చేర్చిన ప్లేయర్లపై ప్రత్యేక కథనం.
సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురైన క్రీడలు ప్రత్యేక రాష్ట్రంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో అన్ని రంగాల్లో లాగానే క్రీడారంగం దేశానికి దిక్సూచిలా నిలుస్తున్నది. ప్రతిభ కల్గిన యువతను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పటికే రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గానికి మినీ స్టేడియం నిర్మాణం, గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ద్వారా ప్లేయర్లకు మౌలిక వసతులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి తోడు మూడు స్పోర్ట్స్ స్కూల్స్(హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్) ద్వారా మెరికల్లాంటి ప్లేయర్లను తయారుచేస్తున్నారు. అంతటితో ఆగకుండా వివిధ జిల్లాల్లో క్రీడా అకాడమీల ద్వారా నిపుణులైన కోచ్ల సమక్షంలో ప్లేయర్లకు మెరుగైన శిక్షణ అందిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠను పెంచుతున్న ప్లేయర్ల సంఖ్య పెరుగుతున్నది. ఇలా తాము ఎంచుకున్న క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్లేయర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నిఖత్ జరీన్
నిజామాబాద్లో పుట్టి ప్రపంచ బాక్సింగ్ను ఏలుతున్న ప్లేయర్. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. తండ్రి జమీల్అహ్మద్ ప్రోత్సాహంతో అనతి కాలంలో మేటి బాక్సర్గాఎదిగింది. వరుసగా రెండు సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన నిఖత్ పారిస్ ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా దూసుకెళుతున్నది.
ఇషాసింగ్
తెలంగాణ తురుపుముక్క ఇషాసింగ్. ఊహ తెలియని వయసు నుంచే షూటింగ్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ పతకాలు కొల్లగొడుతున్నది. పిట్ట కొంచెం కూత ఘనమన్నట్లు ఇషా గురికి తిరుగులేకుండాపోయింది. ఇప్పటికే పలు ప్రపంచకప్లలో పతకాలు సొంతం చేసుకున్న ఈ హైదరాబాదీ ఒలింపిక్స్లో పతకం సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నది.
సిరాజ్
భారత క్రికెట్కు దొరికిన ఆణిముత్యం సిరాజ్. హైదరాబాద్ గల్లీలో టెన్నిస్ బంతితో ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సిరాజ్ 2017లో టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు.
సౌమ్య
నిజామాబాద్ గిరిజన ముద్దుబిడ్డ గుగులోతు సౌ మ్య. కూనేపల్లి గ్రామంలో పుట్టిన సౌమ్య ప్రస్తుతం భారత మహిళల ఫుట్బాల్ జట్టులో మిడ్ఫీల్డర్గా రాణిస్తున్నది.
హుసాముద్దీన్
నిజామాబాద్ గడ్డపై పుట్టిన హుసాముద్దీన్ భారత బాక్సింగ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రపంచ చాంపియన్షిప్ (2023)లో కాంస్యం, కామన్వెల్త్ (2018, 22)లో రెండు కాంస్యాలు కొల్లగొట్టాడు.
నందిని
సాంఘిక సంక్షేమ గురుకుల మేలిమిముత్యం అగసర నందిని. ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపిస్తూ అథ్లెటిక్స్లో పతకాల పంట పండిస్తున్నది.
శ్రీజ
భారత టేబుల్ టెన్నిస్ యువ సంచలనం ఆకుల శ్రీజ. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ కామన్వెల్త్ గేమ్స్ (2022)లో పసిడి దక్కించుకుంది.
అర్జున్
దేశ చెస్ను రాజులా ఏలుతున్న ఇరిగేసి అర్జున్ వరంగల్ వాసి. 14 ఏండ్లకే గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్న అర్జున్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు.
ఇలా వీరే కాదు తెలంగాణ నుంచి సత్తాచాటుతున్న వారిలో తిలక్వర్మ, జివాంజీ దీప్తి, వ్రిత్తి అగర్వాల్, సురభి భరద్వాజ్, గొంగడి త్రిష, స్నేహిత్, కార్తీక్రెడ్డి, గాయత్రి గోపీచంద్ ఉన్నారు.