ప్రపంచకప్ టోర్నీ పతక విజేతలకు తగిన ప్రోత్సాహం లభించింది. అంతర్జాతీయ వేదికలపై పసిడి పతకాలతో వెలుగులు విరజిమ్మిన తెలంగాణ క్రీడా తారలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. అద్భుత ప్రదర్శనతో దేశం యావత్తు గర్వపడేలా చేసిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్కు చెరో రూ.2 కోట్ల నజరానా దక్కింది. దీనికి తోడు హైదరాబాద్లో ఇద్దరికీ ఇంటి స్థలం కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ నిఖత్, ఇషాను ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ప్లేయర్లకు ప్రభుత్వం మరోమారు అండగా నిలిచింది.
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేసిన తెలంగాణ క్రీడాతారలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో ప్రోత్సాహం అందించింది. అభివృద్ధి విషయంలో అన్ని రంగాల్లో దేశానికి దిక్సూచిగా దూసుకెళుతున్న తెలంగాణ క్రీడల్లోనూ విరాజిల్లుతున్నది. టర్కీలోఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్తో పాటు జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో హ్యాట్రిక్ స్వర్ణాలతో మెరిసిన యంగ్గన్ ఇషాసింగ్కు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అంతర్జాతీయ వేదికలపై పసిడి పతకాలతో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన నిఖత్, ఇషాసింగ్కు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహంతో పాటు జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్లో నివాస స్థలాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ బుధవారం ఆదేశించారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ గార్డెన్స్ వేదకగా గురువారం జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రపంచ పతక విజేతలు నిఖత్జరీన్, ఇషాసింగ్ను ప్రభుత్వం సమున్నత రీతిలో సత్కరించనుంది. ఇదిలా ఉంటే 2014లోనూ నిఖత్ జరీన్కు సీఎం కేసీఆర్ రూ.50 లక్షల చెక్ అందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలంటూ యువ బాక్సర్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతో గత కొన్నేండ్లుగా నిఖత్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ వస్తున్నది. ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం ద్వారా తన సత్తా ఏంటో చూపించిన జరీన్.. కామన్వెల్త్, ఆసియా గేమ్స్, పారిస్(2024) ఒలింపిక్స్లో పతకాలే లక్ష్యమని ప్రకటించింది.
నిఖత్కు ప్రధాని మోదీ అభినందన
న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకంతో మెరిసిన యువ బాక్సర్ నిఖత్ జరీన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. నిఖత్తో పాటు మెగాటోర్నీలో కాంస్య పతకాలు సాధించిన పర్వీన్, మనీషా మౌన్ బుధవారం మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా బాక్సర్లతో కొద్దిసేపు ఆయన ముచ్చటించారు. ఈ స్థాయికి చేరుకోవడంలో ఎదురైన ఇబ్బందులు, బాక్సర్ల కుటుంబ నేపథ్యాన్ని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. మోదీని కలువడం చాలా సంతోషంగా ఉందంటూ ఆయనతో కలిసి దిగిన ఫొటోను నిఖత్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఇషాసింగ్ ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. గత ఏడు, ఎనిమిదేండ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న ఇషాకు ప్రభుత్వం వందశాతం మద్దతుగా నిలుస్తుందనుకున్నాం. అందుకు తగ్గట్లు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ ప్రభుత్వం నగదు ప్రోత్సాహం ప్రకటించడం బాగుంది. ఈ క్రమంలో మాకు సహకరించిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఇషాసింగ్ తండ్రి సచిన్సింగ్
అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్న నిఖత్ జరీన్కు భారీ ప్రోత్సాహం అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు. ప్రభు త్వ అండతో భవిష్యత్లో రాష్ట్ర ఖ్యాతిని మరింత ఇనుమడింజేసేలా నిఖత్ రాణిస్తుందన్న నమ్మకం ఉంది. రానున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్తో పాటు ఆసియా గేమ్స్, పారిస్ ఒలింపిక్స్లో పసిడి పతకం లక్ష్యంగా నిఖత్ కష్టపడుతున్నది.
– నిఖత్ తండ్రి జమీల్
విజేతలను చూసి అందరం గర్వపడుతున్నాం. ప్రపంచ టోర్నీల్లో సత్తాచాటిన నిఖత్ జరీన్, ఇషాసింగ్కు సీఎం కేసీఆర్ 2 కోట్లతో పాటు హైదరాబాద్లో నివాస స్థలాలు ప్రకటించారు. జై హింద్, జై తెలంగాణ.
–కవిత, ఎమ్మెల్సీ