Teamindia record in Oval : ఇంగ్లండ్లోని ఓవల్(Oval) స్టేడియం మరో రెండు రోజుల్లో హోరెత్తనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) సందర్భంగా ఈ స్టేడియం అభిమానుల సంద్రంగా మారనుంది. ఇప్పటికే ప్రాక్టీస్ వేగం పెంచిన భారత్, ఆస్ట్రేలియా జట్లు టెస్టు గద ఫైట్ కోసం సిద్ధంగా ఉన్నాయి. అయితే.. ఓవల్ పిచ్ మీద గర్జించేది ఎవరు? తడాఖా చూపించేది ఎవరు? అనే ఆసక్తి ఫ్యాన్స్లో మొదలైంది. ఈ స్టేడియలో భారత జట్టు రికార్డు ఎలా ఉందో తెలుసా…?
ఇప్పటి వరకు ఈ వేదికపై టీమిండియా 14 టెస్టులు ఆడింది. కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. ఐదు టెస్టులో ఓడింది. 7 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇండియా ఓవల్ స్టేడియంలో 1936లో తొలి మ్యాచ్ ఆడింది. అయితే.. ఆ గేమ్లో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఓడిపోయింది. ఇంగ్లండ్ గడ్డపై 1971లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. మూడో టెస్టులో 4 వికెట్లతో భారత్ గెలుపొందింది.
ఓవల్ స్టేడియం
అతర్వాత మళ్లీ 2021లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని యువ భారత్ ఇంగ్లండ్ను చిత్తు చేసింది. టీమిండియాకు అయితే.. అదంతా గతం. ఇప్పుడు జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, యువ కెరటం శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే సూపర్ ఫామ్లో ఉన్నారు. ఐపీఎల్లో వికెట్ల వేట కొనసాగించిన ప్రధాన పేసర్లు షమీ, సిరాజ్ ఫైనల్లో తమ పేస్ పదును చూపించనున్నారు. ఇక స్విన్ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సత్తా గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఓవల్లో అత్యధిక రన్స్ కొట్టిన భారత ఆటగాడు ఎవరో తెలుసా…? ‘దివాల్’ రాహుల్ ద్రవిడ్. అతను 443 పరుగులు చేశాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్(272 రన్స్), రవి శాస్త్రి(253 పరుగులు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ వేదికపై జడేజా అత్యధికంగా 11 వికెట్లు తీశాడు. కపిల్ దేవ్ 10, భగవత్ చంద్రశేఖర్ 8 వికెట్లు పడగొట్టారు.