Gary Kirsten : ఈ ఏడాది భారత జట్టు ఓపెనర్ శుభ్మన్ గిల్(Shubman Gill) పరుగుల వరద పారిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా తన బ్యాట్ పవర్ చూపిస్తున్నాడు. మరే క్రికెటర్కు సాధ్యం కానీ రీతిలో ఒకే ఏడాది టెస్టు, వన్డే, టీ20, ఐపీఎల్లో శతకాలు బాదాడు. దాంతో, ఈ యంగ్ ఓపెనర్ను మాజీలు ఆకాశానికెత్తేస్తున్నారు. ‘ఫ్యూచర్ స్టార్’ అని, ‘యంగ్ కోహ్లీ’ అని.. ఇలా రకరకాలుగా అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి అతడిని భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)తో పోలుస్తున్నారు. అయితే.. గిల్ను సచిన్, విరాట్ కోహ్లీ(Virat Kohi) వంటి దిగ్గజ క్రికెటర్లతో పోల్చడం సరికాదని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ అభిప్రాయపడ్డాడు.
పదహారో సీజన్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మెంటార్గా ఉన్న కిర్స్టెన్, గిల్ను చాలా దగ్గరగా చూశాడు. అందుకనే అతను ఈ మాట అన్నాడు. ‘శుభ్మన్కు అపారమైన నైపుణ్యం ఉంది. ప్రపంచంలోనే ఉత్తమ క్రికెటర్లతో తన పేరు ఉండాలని గిల్ అనుకుంటున్నాడు. అయితే.. అతడిని ఇప్పుడిప్పుడే ఆల్టైమ్ గ్రేట్ క్రికెటర్లు సచిన్, కోహ్లీతో పోల్చడం తొందరపాటే అవుతుంది.
ఐపీఎల్ 2023లోగుజరాత్ టైటాన్స్ మెంటార్ – గ్యారీ కిర్స్టెన్
ఎందుకంటే.. గిల్ అంతర్జాతీయ కెరీర్ ఈమధ్యే మొదలైంది. రాబోయే రోజుల్లో మూడు ఫార్మాట్లలో అతను ఎలా రాణిస్తాడు అనేది కీలకం కానుంది. అప్పుడే అతడిపై ఒక నిర్ణయానికి రాగలం’ అని కిర్స్టెన్ వెల్లడించాడు. అంతేకాదు. శుభ్మన్కు కెప్టెన్ అయ్యే సత్తా ఉందని, అతడు ఆటను చాలా బాగా అర్థం చేసుకుంటాడని అన్నాడు. కిర్స్టన్ కోచ్గా ఉన్నప్పుడే 2011లో ఎంస్ ధోనీ సేన వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే.
ఈఏడాది ప్రారంభం నుంచి శుభ్మన్ గిల్ దూకుడు మొదలైంది. మొదట వన్డేల్లో శ్రీలంకపై సెంచరీ, ఆ తర్వాత డబుల్ సెంచరీ బాదాడు. ఆ తర్వాతి సిరీస్లో న్యూజిలాండ్పై టీ290లో శతకం సాధించాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై మూడంకెల స్కోర్ చేశాడు. దాంతో, ఒకే ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. కెరీర్లోనే భీకర ఫామ్లో ఉన్న ఈ ఓపెనర్ ఐపీఎల్లోనూ చెలరేగాడు. ఏకంగా మూడు సెంచరీలు బాది తనలో పరుగుల దాహం తగ్గలేదని నిరూపించాడు. అంతేకాదు ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
దాంతో, ఓవల్ వేదికగా జూన్ 7న మొదలయ్యే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో గిల్పై అంచనాలు ఎక్కువయ్యాయి. అతడు ఐపీఎల్ ఫామ్ను కొనసాగించాలని కెప్టెన్ రోహిత్ శర్మతో సహా భారత క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ యంగ్స్టర్ ఖాతాలో రెండు టెస్టు సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 4 శతకాలు, టీ20లో ఒక సెంచరీ ఉంది. సచిన్ ఖాతాలో 100 అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి. కోహ్లీ 75 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.