Team India : ఈ ఏడాది భారత పర్యటనను ఇంగ్లండ్(England) జట్టు ఎప్పటికీ మర్చిపోలేదేమో. సొంత గడ్డపై ‘బజ్ బాల్’ ఆటతో యాషెస్ సిరీస్(Ashes Series) కాపాడుకున్న బెన్ స్టోక్స్ సేన టీమిండియా(Team India) చేతిలో మాత్రం చావుదెబ్బ తిన్నది. అది కూడా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ వంటి స్టార్ ఆటగాళ్లు లేని భారత్ జట్టు చేతిలో 4-1తో సిరీస్ కోల్పోయింది. రోహిత్ సేన సిరీస్ విజయం ఘనతంతా నూటికి నూరుపాళ్లు కుర్రాళ్లకే చెందుతుంది.
అవును.. ఒకరా ఇద్దరా.. ఏకంగా నలుగురు కుర్రాళ్లు ఈ సిరీస్లో ఇంగ్లండ్పై శివతాండవం చేశారు. సీనియర్ల స్థానాన్ని తాము భర్తీ చేయగలమనే భరోసా కల్పించారు. యశస్వీ జైస్వా ల్(Yashasvi Jaiswal), శుభ్మన్ గిల్లు తమ సత్తాను చాటుకోగా.. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(Dhruv Jurel)లు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడుతూ పరుగుల వరద పారించి.. భారత జట్టు రికార్డు విజయంలో భాగమయ్యా రు. ఈ నలుగురిలో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ విజయ రహస్యం రంజీలే. దేశవాళీ క్రికెట్లో సెంచరీలతో హోరెత్తించి.. సెలెక్టర్ల దృష్టిలో పడ్డారు.
𝙒.𝙄.𝙉.𝙉.𝙀.𝙍.𝙎! 🏆
Congratulations #TeamIndia on winning the @IDFCFIRSTBank #INDvENG Test Series 4⃣-1⃣ 👏👏 pic.twitter.com/IK3TjdapYv
— BCCI (@BCCI) March 9, 2024
ఉప్పల్ టెస్టులో దారుణంగా ఓడిన టీమిండియా 4-1తో సిరీస్ గెలుస్తుందని సగటు అభిమానులు ఎవరూ ఊహించి ఉండరు. కానీ, భారత జట్టు అద్భుతం చేసింది. కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ల నమ్మకాన్ని కుర్రాళ్లు నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా యశస్వీ జైస్వాల్ వైజాగ్, రాజ్కోట్ టెస్టులో రెండు డబుల్ సెంచరీలో చెలరేగాడు. ఒకే సిరీస్లో అత్యధికంగా 26 సిక్సర్లతో రికార్డులు బద్ధలు కొట్టిన ఈ చిచ్చరపిడుగు.. ఐదు మ్యాచుల్లో 712 పరుగులు బాదేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు ఎగరేసుకుపోయాడు.
యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్
ఇక ఓపెనర్ నుంచి మూడో స్థానంలో ఆడిన గిల్.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) లోటును పూడ్చడం ఎంత కష్టమో చవిచూశాడు. ఒక దశలో బెంచ్ మీదకు వెళ్లాల్సిన అతడు రాజ్కోట్, రాంచీ టెస్టులో బ్యాట్ ఝులిపించాడు. ధ్రువ్ జురెల్లో 74 పరుగుల విలువైన భాగస్వామ్యంతో జట్టును గెలిపించాడు. ధర్మశాలలోనూ సెంచరీతో కదం తొక్కిన గిల్.. 452 పరుగులతో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు.
సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్
ఇక శ్రేయస్ అయ్యర్ వైఫల్యంతో రాజ్కోట్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ రఫ్పాడించాడు. ఇంగ్లండ్ స్పిన్ ద్వయం బషీర్, హర్ట్లేతో పాటు రూట్ను సమర్థంగా ఎదుర్కొంటూ మూడు హాఫ్ సెంచరీలతో రాణించగా.. ధ్రువ్ జురెల్ ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్లు ఆడగలని నిరూపించుకున్నాడు. రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో (96) హాఫ్ సెంచరీతో జట్టును గట్టెక్కించిన అతడు .. వికెట్ కీపర్గానూ శ్రీకర్ భరత్ కంటే మంచి మార్కులే కొట్టేశాడు.
ఈ సిరీస్లో కుల్దీప్ యాదవ్ తనలోని ఆల్రౌండర్ను చూపించాడు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో తిప్పేసిన అతడు.. ఇంగ్లండ్ బ్యాటర్లను తన బంతులతో బోల్తా కొట్టించాడు అంతేనా సమయోచింగా ఆడి బ్యాటుతోనూ విలువైన రన్స్ చేశాడు. ధర్మశాలలో 30 రన్స్ చేసిన అతడు బుమ్రాతో కలిసి 49 పరుగులు జోడించి భారత్ స్కోర్ 450 దాటించాడు. మొత్తంగా ఈ సిరీస్లో 19 వికెట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
జడేజా, అశ్విన్, కుల్దీప్
నామమాత్రమైన ఐదో టెస్టులో భారత్ తొలి రోజు నుంచే పట్టుబిగించింది. టాపార్డర్ దంచి కొట్టడంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 477 పరుగులకు ఆలౌటయ్యింది. అనంతరం అశ్విన్, బుమ్రా విజృంభణతో భారత జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన జో రూట్(84) కుల్దీప్ యాదవ్ ఓవర్లో బౌండరీ వద్ద బుమ్రాకు దొరికాడు. దాంతో, ఇంగ్లండ్ 195 పరుగులకు కుప్పకూలింది. వరుసగా నాలుగో విజయంతో టీమిండియా 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, యశస్వీ జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు అందుకున్నారు.