TTD | తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి 24 వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో మలయప్పస్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 20న సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేయనున్నారు.
రెండోరోజు 21న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై విహరిస్తారు. మూడోరోజు 22న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. నాలుగో రోజు 23న శ్రీమలయప్పస్వామి ఐదుసార్లు, చివరి రోజు 25వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.