పల్లెకెలె: తొలి మ్యాచ్లో బౌలర్లు రాణించడంతో సిరీస్లో బోణీ కొట్టిన టీమ్ఇండియా.. శ్రీలంకతో జరుగనున్న రెండో వన్డేలోనూ నెగ్గి సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సోమవారం భారత్, లంక మధ్య రెండో వన్డే జరుగనుంది. టాపార్డర్ నిలకడలేమి టీమ్ఇండియాను ఇబ్బంది పెడుతుండగా.. ఇప్పటికే మన అమ్మాయిల చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన లంక ఈ సారైనా పోటీనివ్వాలని భావిస్తున్నది.
ఓపెనర్లు స్మృతి మందన, షఫాలీ వర్మ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతుండటం మేనేజ్మెంట్ను కలవర పెడుతున్నది. వన్డే ఫార్మాట్లో కెప్టెన్గా పగ్గాలు అందుకున్న హర్మన్ప్రీత్ కౌర్ మంచి ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం కాగా.. బౌలర్లు తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా దీప్తి శర్మ, రేణుక మంచి జోరు మీదున్నారు. వీరు ఇదే ఆటతీరు కొనసాగిస్తే.. మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ సిరీస్ పట్టేయడం ఖాయమే!