World Cup 2023 | వన్డే ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ భారత్ను విజయతీరాలకు చేర్చారు. తొలి మూడు వికెట్లు టపటపా పడిపోయినా.. కోహ్లీ, రాహుల్ సంయమనంతో ఆడుతూ.. జట్టును విజయ తీరాలకు చేర్చారు. చివరి వరకూ మ్యాచ్ను నిలబెట్టిన విరాట్ కోహ్లీ 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. కోహ్లీ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా సహకారంతో.. 52 బంతులు మిగిలి ఉండగానే కేఎల్ రాహుల్ (97) చివరి బంతి సిక్సర్ కొట్టి జట్టును గెలిపించాడు. కానీ మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. నాలుగు వికెట్లు కోల్పోయి టీం ఇండియా 201 పరుగులు చేసింది. జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన కేఎల్ రాహుల్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
చెన్నైలో జరుగుతున్న వరల్ కప్ ఐదో మ్యాచ్లో ఆస్ట్రేలియా విధించిన 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియాకు ప్రారంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. సారధి రోహిత్ శర్మ సహా ఓపెనర్ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ డకౌట్ కావడంతో మూడు వికెట్లు కోల్పోయి టీం ఇండియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. జట్టు పరిస్థితి చక్కదిద్దే బాధ్యత తలకెత్తుకున్నారు.
ఆస్ట్రేలియా బౌలర్ల దాడిని తట్టుకుని.. ఆచితూచి ఆడుతూ.. సింగిల్స్ తీస్తూ.. అడపాదడపా బంతిని బౌండరీ బాట పట్టిస్తూ.. క్రమంగా జట్టు స్కోర్ పెంచుతూ వచ్చారు. కమిన్స్ 26వ ఓవర్ మూడో బంతిని సింగిల్ గా మలిచి విరాట్ కోహ్లీ, 28వ ఓవర్ తొలి బంతితో సింగిల్ తీసి కేఎల్ రాహుల్ చెరో అర్థ శతకం పూర్తి చేశారు. 38వ ఓవర్ లో హేజిల్ వుడ్ వేసిన నాలుగో బంతిని లబుషేన్.. క్యాచ్ పట్టడంతో కోహ్లీ ఔట్ కావడంతో నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 165 పరుగులతో తెర పడింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 49.3 ఓవర్లకు 199 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఆసీస్ బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి తంటాలు పడ్డారు. మూడో ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వార్నర్, స్టీవెన్ స్మిత్ నిలకడగా ఆడారు. కానీ 17వ ఓవర్లో వార్నర్ ఔట్తో వికెట్ల పతనం మొదలైంది. 28వ ఓవర్లో స్టీవెన్ స్మిత్ ఔట్తో పరిస్థితి మరింత దిగజారింది. లబుషేన్ (27), గ్లెన్ మాక్స్వెల్ (15), పాట్ కమ్మిన్స్ (15) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
మిగతా బ్యాటర్లలో అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్ల చొప్పున తీశారు. రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. భారత బౌలింగ్ ధాటికి అద్భుతమైన ఫీల్డింగ్ కూడా తోడు కావడంతో ఆసీస్ తక్కువ స్కోర్కు ఆలౌట్ అయ్యింది.