ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకుండానే బోణీ కొట్టిన టీమ్ఇండియా.. అదే జోరు కొనసాగిస్తూ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకుంది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై మొదట మంచి స్కోరు చేసిన రోహిత్ సేన.. ఆనక బౌలింగ్లో విజృంభించి ప్రత్యర్థిని చుట్టేసింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన విలువ చాటుకోగా.. విరాట్ కోహ్లీ వైఫల్యాన్ని కొనసాగించాడు. నేడు నాటింగ్హామ్లో నామమాత్రమైన మూడో మ్యాచ్ జరుగనుంది.
బర్మింగ్హామ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లండ్పై 2-0తో టీ20 సిరీస్ పట్టేసింది. శనివారం జరిగిన రెండో పోరులో భారత్ 49 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషబ్ పంత్ (26; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4, అరంగేట్ర పేసర్ రిచర్డ్ గ్లీసన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. మోయిన్ అలీ (35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ విల్లే (33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 3, బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఆదివారం నాటింగ్హామ్ వేదికగా ఇరు జట్ల మధ్య చివరి టీ20 జరుగనుంది.
కోహ్లీ మళ్లీ విఫలం..
మ్యాచ్ ఫలితం కన్నా.. విరాట్ కోహ్లీ (1) ఫామ్ గురించే ఎక్కువ చర్చ సాగుతున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన మాజీ కెప్టెన్ మరోసారి నిరాశ పరిచాడు. షాట్ సెలెక్షన్కు దురదృష్టం తోడవడంతో కోహ్లీ ఒకింత నిర్వేదంగా పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ స్థానంలో రిషబ్ పంత్ ఓపెనర్ అవతారం ఎత్తగా.. మరో ఎండ్లో కెప్టెన్ రోహిత్ ఆరంభం నుంచే ధాటిగా ఆడటంతో టీమ్ఇండియాకు శుభారంభం దక్కింది. విల్లే బౌలింగ్లో రోహిత్ రెండు సిక్సర్లు బాదితే.. పంత్ రెండు ఫోర్లు అరుసుకున్నాడు.
మోయిన్ అలీ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన హిట్మ్యాన్.. గ్లీసన్ బౌలింగ్లో కీపర్ బట్లర్ పట్టిన సూపర్ క్యాచ్కు పెవిలియన్ బాటపట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ 61/1తో నిలిచింది. ఆ తర్వాతి బంతికే విరాట్ మలాన్ పట్టిన అద్వితీయ క్యాచ్కు విరాట్ వెనుదిరగగా.. పంత్ కీపర్కు చిక్కాడు. ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసిన సూర్యకుమార్ (15), హార్దిక్ పాండ్యా (12)ను జోర్డాన్ వరుస బంతుల్లో ఔట్ చేయగా.. కార్తీక్ (12) రనౌటయ్యాడు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గని జడేజా.. లోయర్ ఆర్డర్తో కలిసి కీలక పరుగులు జోడిస్తూ జట్టుకు మంచి స్కోరు అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 170/8 (జడేజా 46*, రోహిత్ 31; జోర్డాన్ 4/27, గ్లీసన్ 3/15), ఇంగ్లండ్: 17 ఓవర్లలో 121 ఆలౌట్ (అలీ 35; భువనేశ్వర్ 3/15, బుమ్రా 2/10).