న్యూఢిల్లీ: ఈ నెల 10 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా టీ20, వన్డే, టెస్టు సిరీస్లు ఆడనుంది. అదే సమయంలో యువ ఆటగాళ్లతో కూడిన భారత-‘ఎ’ జట్టు కూడా దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఈ యువ జట్టు రెండు అనధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బరిలోకి దిగిన భారత జట్టులో సభ్యుడైన శ్రీకర్ భరత్ను దక్షిణాఫ్రికా టూర్కు ఎంపిక చేయకపోగా.. ఇప్పుడు ‘ఎ’ జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. సఫారీ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్లో ఉన్న చెత్త రికార్డును తిరగరాయలని భావిస్తున్న బీసీసీఐ.. ఆ దిశగా రెండు మ్యాచ్ల కోసం రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది.
దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు ఇందులో అవకాశం కల్పించింది. భరత్తో పాటు సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురేల్, మానవ్ సుతార్, విద్వత్ కవెరప్ప, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, తుషార్ దేశ్పాండేకు చోటు దక్కింది. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నవ్దీప్ సైనీని రెండో అనధికారిక టెస్టు ఆడే జట్టులో చోటు కల్పించారు. ఈ రెండు మ్యాచ్ల కంటే ముందు నిర్వహించనున్న ఇంటర్ స్కాడ్ మూడు రోజుల మ్యాచ్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. సఫారీ టూర్లోని పరిమిత ఓవర్ల సిరీస్ల నుంచి ఈ ఇద్దరూ విశ్రాంతి కోరగా.. బోర్డు అందుకు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఇక భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 26 నుంచి బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుండగా.. 20 నుంచి 22 వరకు జరుగనున్న మూడు రోజుల పోరు వరకు రోహిత్, కోహ్లీ జట్టుతో చేరనున్నారు.