తొలి పోరులో కంగారూలను చిత్తుచేసిన టీమ్ఇండియా.. మలిపోరులో అఫ్గానిస్థాన్ను ఢీకొట్టేందుకు రెడీ అయింది. డెంగ్యూ బారిన పడిన శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్కు కూడా అందుబాటులో లేకపోగా.. టాపార్డర్పై భారీ అంచనాలున్నాయి!
దక్షిణాఫ్రికా రికార్డు స్కోరు చేసిన పిచ్పై రోహిత్ సేన కూడా దుమ్మురేపాలని అభిమానులు ఆశిస్తుంటే.. ఆతిథ్య జట్టుకు కనీస పోటీనివ్వాలని కాబూలీలు భావిస్తున్నారు. స్పిన్కు అనుకూలించనున్న పిచ్పై బంతిని గింగిరాలు తిప్పేందుకు రషీద్ ఖాన్, నబీ, ముజీబ్ త్రయం రెడీ అవుతుంటే.. సాధికారిక విజయంతో జోరు కొనసాగించాలని టీమ్ఇండియా చూస్తున్నది. మరి పరుగుల వరద పారే ఢిల్లీలో ఎవరిది పైచేయి అవుతందనేది ఆసక్తికరం!
న్యూఢిల్లీ: పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా రెండో మ్యాచ్కు సిద్ధమైంది. మొదటి పోరులో ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన రోహిత్ సేన బుధవారం అఫ్గానిస్థాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నై వేదికగా ఆసీస్తో జరిగిన పోరులో ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన టాప్-3 బ్యాటర్లపై ఈ సారి ఒత్తిడి ఎక్కువగా ఉండటం సహజమే కాగా.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అదే జోష్ కొనసాగించాలని చూస్తున్నారు. చెపాక్ పిచ్ స్పిన్కు సహకరిస్తే.. ఢిల్లీ వికెట్ బ్యాటర్లను రా.. రమ్మని ఆహ్వానిస్తున్నది. ఈ మైదానంలో దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరిగిన పోరులో భారీ స్కోర్లు నమోదయ్యాయి. సఫారీ జట్టు నుంచే ముగ్గురు ప్లేయర్లు సెంచరీలు చేస్తే.. ఛేదనలో లంక కూడా మూడొందల పైచిలుకు పరుగులతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి భారీ స్కోర్లు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మెగాటోర్నీకి ముందు భారీ ఆశలు రేపిన యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. డెంగ్యూ నుంచి పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో.. అతడు అందుబాటులో లేకపోగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి లెఫ్టార్మ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.
గత మ్యాచ్లో విఫలమైన రోహిత్, ఇషాన్, శ్రేయస్.. ఈసారైనా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటున్నది. మరోవైపు ఇటీవలి కాలంలో ప్రమాదకర జట్టుగా ఎదిగిన అఫ్గానిస్థాన్.. కలిసికట్టుగా కదం తొక్కి స్పిన్తోనే టీమ్ఇండియాను ఇబ్బంది పెట్టాలని వ్యూహాలు రచిస్తున్నది. కోహ్లీ సొంత మైదానంలో కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీ పేరిట నిర్మించిన స్టాండ్ ఎదురుగా కింగ్ బ్యాటింగ్కు దిగనుండగా.. గాయం నుంచి తిరిగి వచ్చాక రాహుల్ మంచి టచ్లో కనిపిస్తున్నాడు. గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగనుంది. మరో మూడు సిక్సర్లు బాదితే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్గా చరిత్రకెక్కనున్న రోహిత్ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో కీలకం కానున్నారు. మరోవైపు తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన అఫ్గాన్.. ఈ సారి స్టార్లతో నిండి ఉన్న టీమ్ఇండియాకు షాక్ ఇవ్వాలని చూస్తున్నది. ముఖ్యంగా భారత పిచ్లపై అపార అనుభవం ఉన్న మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ నుంచి రోహిత్సేనకు ముప్పు పొంచి ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. రహ్మానుల్లా, హష్మతుల్లా, ఇబ్రహీం జద్రాన్, మహమ్మద్ నబీ, నజీబుల్లా రూపంలో అఫ్గాన్ జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదు. మరి నాణ్యమైన భారత బౌలింగ్ను ఎదుర్కొంటూ కాబూలీలు ఏమాత్రం నిలబడగలరో చూడాలి!
గత మ్యాచ్లో ప్రపంచకప్లోనే అత్యధిక స్కోరు నమోదైన పిచ్ కావడంతో ఈ సారి కూడా బ్యాటర్లకు సహకరించనుందనే విశ్లేషణలు ఉన్నాయి. మ్యాచ్కు వర్ష సూచన లేదు.
భారత్: రోహిత్ (కెప్టెన్), ఇషాన్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
అఫ్గానిస్థాన్: హష్మతుల్లా (కెప్టెన్), రహ్మానుల్లా, ఇబ్రహీం, నబీ, నజీబుల్లా, అజ్మతుల్లా, రషీద్ఖాన్, నవీన్, ముజీబ్, ఫజల్హక్.