గత నాలుగైదు టీ20 మ్యాచ్లలో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణమేంటని ఎవరిని అడిగినా వినిపించే సమాధానం ఒక్కటే. బౌలింగ్ వైఫల్యం వల్లే భారత్ ఓడిందనేది బహిరంగ రహస్యమే. టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ నానాటికీ తీసికట్టుగా మారడం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో భారత జట్టు సారథి రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్, బౌలింగ్ కోచ్ పరాబ్ మంబ్రే, మెంటల్ కండీషనింగ్ కోచ్ పాడీ అప్టన్లు టీమిండియా బౌలర్లందరితో సమావేశమయ్యారని తెలుస్తున్నది.
మొహాలీలో ఆస్ట్రేలియాతో తొలి టీ20లో రెండు వందల పరుగులు చేసినా బౌలర్లు దానిని కాపాడలేకపోయారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్, కోచింగ్ సిబ్బంది అంతా భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, హర్షల్ పటేల్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్లతో భేటీ అయ్యారని సమాచారం.
సమావేశంలో భాగంగా బౌలర్లు పదే పదే విఫలమవడానికి గల కారణాలతో పాటు రాబోయే పొట్టి ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని బౌలర్లు ఏ పాత్ర పోషించాలి..? అనే విషయమ్మీద వారికి దిశా నిర్దేశం చేసినట్టు జట్టు వర్గాల ద్వారా తెలుస్తున్నది. ముందు బౌలర్లందరితో కెప్టెన్, కోచ్లు సమావేశం కాగా అది ముగిశాక మెంటల్ కండీషనింగ్ కోచ్ పాడీ అప్టన్ ఒక్కొక్క బౌలర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యాడని సమాచారం.
తొలి టీ20లో 208 పరుగులు చేసినా భారత జట్టు దారుణ పరాజయం పాలైన విషయం తెలిసిందే. షమీకి కరోనా సోకడంతో జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ ఆకట్టుకోలేదు. దీంతో రెండో టీ20లో అతడిని బెంచ్కు పరిమితం చేసి బుమ్రాను తుది జట్టులో ఆడించే అవకాశాలున్నాయి.