WTC Cycle 2023-25 : ప్రపంచ టెస్టు చాంపియనషిప్( World Test Championship ) మూడో సీజన్లో భారత జట్టు ( Team India ) అదరగొడుతోంది. వెస్టిండీస్ ( Westindies )పై తొలి టెస్టులో భారీతేడాతో గెలిచిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. మొదటి టెస్టు విజయంతో 12 పాయింట్లు సాధించిన భారత్ వంద శాంతం విజయాలతో వరల్డ్ నంబర్ 1 ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టింది. యాషెస్ సిరీస్ ( Ashes Series )లో ఇంగ్లండ్ ( England )తో తలపడుతున్న ఆసీస్ 61.11 శాతం విజయాలతో రెండో ప్లేస్ దక్కించుకుంది.
మూడో టెస్టులో సంచలన విజయం సాధించిన ఇంగ్లండ్ మూడో స్థానం దక్కించుకుంది. ఇటీవలే అఫ్గనిస్థాన్తో జరిగిన ఏకైక టెస్టులో 546 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్(Bangladesh) నాలుగో ప్లేస్లో ఉంది. న్యూజిలాండ్ జట్టు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
టీమిండియా 203-25 డబ్ల్యూటీసీ సైకిల్ను విజయంతో ఆరంభించింది. వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత జట్టు అద్భుతంగా ఆడి ఇన్నింగ్స్ 141 పరుగులతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్లో విండీస్ను 150 పరుగులకే కట్టడి చేసింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin ) ఐదు వికెట్లతో కరీబియన్లను దెబ్బ కొట్టాడు. ఆరంగేట్రం మ్యాచ్లోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (171) సెంచరీతో కదం తొక్కాడు.
యశస్వీ జైస్వాల్ (171)
కెప్టెన్ రోహిత్ శర్మ(103) శతకానికి తోడు విరాట్ కోహ్లీ(71 నాటౌట్) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, ఇండియా 421/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన విండీస్ను మళ్లీ అశ్విన్ 7 వికెట్లతో చావు దెబ్బతీశాడు. దాంతో, 130 పరుగులకే అతిథ్య జట్టు ఆలౌటయ్యింది. రెండు టెస్టుల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్ డిసైడర్ అయిన రెండో టెస్టు జూలై 20న ట్రినిడాడ్ అండ్ టొబాగోలో జరగనుంది.
ఐసీసీ 2021లో తొలిసారి ప్రపంచ టెస్టు చాంపియనషిప్ సైకిల్ను ప్రారంభించింది. తొలి సీజన్లో భారత్, న్యూజిలాండ్(Newzealand) జట్లు ఫైనల్ చేరాయి. లార్డ్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) సారథ్యంలోని టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. కివీస్ ఆల్రౌండర్ కైలీ జేమీసన్ అద్భుత బౌలింగ్తో భారత టాపార్డర్ను దెబ్బకొట్టాడు.
2021లో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన విరాట్ బృందం
అయితే.. ఎలాగైనా టెస్టు గదను దక్కించుకోవాలని భారత్ పట్టుదలగా ఆడి రెండోసారి ఫైనల్ చేరింది. కానీ, ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో కోట్లాది మంది అభిమానులను నిరాశపరిచింది. ఓవల్ స్టేడియంలో భారత జట్టును చిత్తు చేసిన కమిన్స్ సేన టెస్టు గదను దక్కించుకుంది. దాంతో, అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.