క్రికెట్ చరిత్రలో మరో అరుదైన రికార్డును సాధించేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో నేటి నుంచి ప్రారంభం కాబోయే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలో జరుగబోయే మ్యాచ్ లో సఫారీలను ఓడిస్తే భారత జట్టు చరిత్ర సృష్టించినట్టే. ఇప్పటికే టీ20 లలో 12మ్యాచులను నెగ్గిన భారత జట్టు.. దక్షిణాఫ్రికాతో తొలి టీ20 గెలిస్తే వరుసగా 13 టీ20 లు గెలిచిన తొలి జట్టుగా అవతరించనుంది.
గతేడాది టీ20 ప్రపంచకప్ లో వరుసగా పాకిస్తాన్, న్యూజిలాండ్ తో ఓడి ఆ టోర్నీ నుంచి నిష్క్రమించినా ఆ తర్వాత భారత జట్టు సాధించిన విజయాల ప్రయాణం ఇప్పటిదాకా అప్రతీహాతంగా సాగుతున్నది. పొట్టి ప్రపంచకప్ లో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలో 3 మ్యాచులు నెగ్గిన టీమిండియా ఆ తర్వాత ఓటమన్నదే లేకుండా సాగుతున్నది.
టీ20 ప్రపంచకప్ అనంతరం స్వదేశంలో న్యూజిలాండ్ ను 3-0తో ఓడించింది భారత జట్టు. ఈ సిరీస్ నుంచే రోహిత్ శర్మ టీమిండియాకు పూర్తి స్థాయి సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సిరీస్ తర్వాత ఫిబ్రవరిలో వెస్టిండీస్ (3-0), మార్చిలో శ్రీలంక (3-0) లను కూడా ఓడించింది భారత్. దీంతో ఇప్పటివరకు వరుసగా 12 మ్యాచులలో అపజయమన్నదే లేకుండా ముందుకుపోతున్నది. లంకతో ఆఖరి టీ20 నెగ్గి ఆఫ్ఘనిస్తాన్, రొమేనియా రికార్డును సమం చేసింది భారత్. ఇక సఫారీలతో నేటి మ్యాచ్ కూడా నెగ్గితే అది ప్రపంచ రికార్డే.
2016 నుంచి 2018 వరకు ఆఫ్ఘనిస్తాన్.. వరుసగా 12 టీ20 లు గెలిచింది. ఒక 2020 అక్టోబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు రొమేనియా ఇదే ఫీట్ ను నమోదు చేశాయి. మరి నేటి మ్యాచ్ లో భారత ఆటగాళ్లు ప్రపంచ రికార్డును నెలకొల్పుతారో లేక 12 విజయాల వద్దే ఆగిపోతారో తేలాలంటే కొన్ని గంటలు ఆగితే తెలుస్తుంది.