KL Rahul : దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా(Team India) పోరాడుతోంది. రబాడ ధాటికి స్టార్ బ్యాటర్లు చేతులెత్తేసిన చోట కేఎల్ రాహల్(KL Rahul) ఖతర్నాక్ ఇన్నింగ్స్తో జట్టును గట్టెక్కించాడు. భారత్ను రెండొందల లోపే చుట్టేయాలని భావించిన సఫారీ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ హాఫ్ సెంచరీ సాధించాడు. కష్ట సమయంలో నేనున్నాంటూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్న రాహుల్పై బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్(Vikram Rathore) ప్రశంసలు కురిపించాడు.
రాహుల్ను భారత జట్టు ఆపద్భాందవుడు అని విక్రమ్ కొనియాడాడు. ‘ఒత్తిడిలోనూ రాహుల్ చక్కగా ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తన గేమ్ ప్లాన్తో సఫారీలకు పరీక్ష పెట్టాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అతడు కష్టకాలంలో జట్టును ఒడ్డున పడేసే ఆపద్భాందవుడు’ అని విక్రమ్ అన్నాడు.
రాహల్, విక్రమ్ రాథోడ్
బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు భారత టాపార్డర్ విఫలమైంది. రబాడ, ఆరంగేట్రం పేసర్ బర్గర్ ధాటికి ఓపెనర్లు రోహిత్ శర్మ(5), యశస్వీ జైస్వాల్(17), శుభ్మన్ గిల్(2) స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(38), అయ్యర్(31) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. ఆదిలోనే రోహిత్ను వెనక్కి పంపిన రబాడ.. వరుసగా కోహ్లీ, అయ్యర్ వికెట్లు తీసి భారత్ను మళ్లీ దెబ్బకొట్టాడు. దాంతో, తొలి రోజే ఆలౌటవ్వడం ఖాయం అనిపించింది.
కానీ, శార్దూల్ ఠాకూర్(24)తో కలిసి కేఎల్ రాహుల్(70 నాటౌట్: 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కళాత్మక షాట్లతో అలరించాడు. ఒత్తిడిలోనూ సాధికారిక ఇన్సింగ్స్ ఆడి హాఫ్ సెంచరీతో జట్టు స్కోర్ రెండొందలు దాటించాడు. దాంతో, భారత్ ఆట ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగలిగింది. రెండో రోజు తొలి సెషన్లో టెయిలెండర్లు సాయంతో రాహుల్ ఎన్ని పరుగులు సాధిస్తాడో చూడాలి.