దుబాయ్: టీ20 ప్రపంచకప్లో ఆలస్యంగా ఫామ్లోకి వచ్చిన టీమిండియా.. సెమీస్ చేరడం భారత్ చేతుల్లో లేదు. ఆదివారం జరిగే న్యూజిల్యాండ్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్పై భారత సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. టోర్నీ ఆరంభంలో పాకిస్థాన్, న్యూజిల్యాండ్ చేతుల్లో ఘోరంగా ఓడిన టీమిండియా.. ఆ తర్వాత కోలుకుంది.
ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్ జట్లపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించి ఘనవిజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలో స్కాట్లాండ్తో మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రెస్మీట్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రవీంద్ర జడేజా మాట్లాడాడు. ఆ సమయంలో ఒక విలేకరి న్యూజిల్యాండ్ చేతిలో ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోతే ఏం చేస్తారు? అని ప్రశ్నించాడు.
ఆ ప్రశ్న విన్న జడ్డూ.. ‘బ్యాగులు సర్దుకొని వెళ్లిపోతాం’ అని టక్కున బదులిచ్చాడు. అతనిచ్చిన సూటి సమాధానానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సదరు విలేకరి నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. స్కాట్లాండ్పై భారీ విజయంతో టీమిండియా రన్రేట్ బాగా మెరుగైంది.
ఆఫ్ఘనిస్థాన్ గనుక కివీస్ను ఓడిస్తే, ఆ తర్వాత నమీబియాపై టీమిండియా మంచి విజయం సాధిస్తే.. భారత జట్టు సెమీస్ చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ టోర్నీలో కేవలం పాక్ చేతిలోనే ఓడిన కివీస్పై ఆఫ్ఘనిస్థాన్కు గెలిచే అవకాశం ఉందా? అనేదే ప్రశ్న.