దుబాయ్: టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు నుంచి వార్తల్లో నిలిచిన టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా. 2019లో వెన్నెముక ఆపరేషన్ తర్వాత అతను బౌలింగ్ చేయలేదు. యూఏఈలో జరిగిన రెండో దశ ఐపీఎల్లో కూడా అతను బంతి పట్టలేదు. అలాంటి సమయంలో అతన్ని టీ20 ప్రపంచకప్ ఆడే జట్టుకు ఎంపిక చేయడం పెద్ద చర్చకే దారితీసింది.
పూర్తి ఫిట్గా లేని పాండ్యాను ఎలా ఎంపిక చేస్తారు? అతను బౌలింగ్ చేయలేకపోతే జట్టుకు ఎంపిక చేయడం తగదు.. అంటూ చాలా రకాల కామెంట్లు వినిపించాయి. వీటి నేపథ్యంలోనో ప్రపంచకప్లో భారత ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్థాన్పై పాండ్యా బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్లో కూడా ఆకట్టుకోలేదు.
దీంతో న్యూజిల్యాండ్తో మ్యాచ్లో అతని స్థానంలో ఇషాన్ కిషన్ను ఎంచుకుంటే మంచిదని పలువురు సీనియర్ క్రీడాకారులు కూడా సలహాలిచ్చారు. ఈ క్రమంలో అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. నెట్స్లో పాండ్యా బౌలింగ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. ‘లోడింగ్..’ అంటూ బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
పాకిస్థాన్ మ్యాచ్లో గాయపడిన పాండ్యా న్యూజిల్యాండ్ మ్యాచ్లో అసలు ఉంటాడా? అనే అనుమానాలకు ఈ ఫొటోలు సమాధానమిచ్చినట్లే కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే న్యూజిల్యాండ్పై పాండ్యా బౌలింగ్ కూడా చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అతని బౌలింగ్లో ఎలాంటి సమస్యలు లేవని బీసీసీఐ కూడా చెప్పడం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది.