Rohit-Kohli | దశాబ్దకాలంగా భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (రోకో)కి ‘ఐసీసీ కప్పు’ కలను నిజం చేసుకునేందుకు మరో అవకాశమొచ్చింది. 2007లో భారత్ తొలి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో హిట్మ్యాన్ ఉండగా.. 2011లో వన్డే వరల్డ్కప్ నెగ్గిన టీమ్లో కోహ్లీ ఉన్నాడు. విడివిడిగా ఈ ఇద్దరికీ ఇవే ఆఖరి ఐసీసీ ట్రోఫీలు. 2013లో భారత్ గెలిచిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ‘రోకో’ ఉన్నప్పటికీ అప్పటికింకా వీళ్లు ‘ధోనీ నీడ’లోనే ఉన్నారు. ఆ తర్వాత మహేంద్రుడి నుంచి సారథ్య పగ్గాలు అందుకున్న కోహ్లీ గానీ.. విరాట్ వారసుడిగా వచ్చిన రోహిత్ గానీ ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేయలేకపోయారు. 2012, 2014, 2016, 2021, 2022 పొట్టి ప్రపంచకప్లలో పలుమార్లు ట్రోఫీకి చేరువగా వచ్చినా వీరికి నిరాశే ఎదురైంది. గతేడాది స్వదేశంలో ముగిసిన వన్డే ప్రపంచకప్లో ‘మెన్ ఇన్ బ్లూ’ ప్రదర్శన చూశాక రోహిత్-కోహ్లీ కలిసి ఐసీసీ ట్రోఫీని ముద్దాడతారని భావించినా తుదిపోరులో టీమ్ఇండియా బోల్తా కొట్టడంతో కోట్లాది అభిమానుల గుండె బద్దలవడంతో పాటు ఈ ఇద్దరి కల కూడా చెదిరింది.
జాతీయ జట్టులోకి కుర్రాళ్లు వేగంగా దూసుకొస్తుండటంతో పాటు వయసు, ఫామ్లేమి సమస్యల నేపథ్యంలో వచ్చే టీ20 వరల్డ్ కప్ నాటికీ ఈ ఇద్దరూ ఆడేది అనుమానమే. రోహిత్కు ప్రస్తుతం 38 ఏండ్లు కాగా 2026 పొట్టి ప్రపంచకప్ నాటికి అతడికి 40 నిండుతాయి. 36 ఏండ్ల కోహ్లీ 38కి వస్తాడు. అప్పటికీ రోహిత్-కోహ్లీ జట్టులో ఉంటారునుకోవడం అత్యాశే. రోహిత్ వయసు, ఫిట్నెస్ సమస్యలతో ఇప్పుడో అప్పుడో రిటైర్మెంట్ ప్రకటించేటట్టు ఉండగా టీ20లో కోహ్లీ ‘స్ట్రైక్ రేట్’ చర్చ విమర్శకులకు నిత్య నూతనమే. వాస్తవానికి ఈసారి పొట్టి జట్టులో ఈ ఇద్దరూ చోటు దక్కించుకోవడంపై విమర్శలు వచ్చినా సెలక్టర్లు మాత్రం ఈ బ్యాటింగ్ యోధులకు ‘ఆఖరి అవకాశం’ ఇచ్చారు. 2022 నవంబర్లో టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓడాక మళ్లీ ఈ ఏడాది జనవరిలో అఫ్గానిస్థాన్ సిరీస్ దాకా ఈ ఇద్దరూ భారత్ తరఫున ఒక్క టీ20 కూడా ఆడలేదు.
‘స్ట్రైక్ రేట్’ తలనొప్పులు ఉన్నా కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్-17లో కోహ్లీ 15 మ్యాచ్లలో 741 పరుగులు చేయడంతో అతడు ‘టచ్’లోనే ఉన్నాడు. కానీ రోహిత్ (14 మ్యాచ్లలో 417) నాలుగైదు మ్యాచ్లలో తప్ప దారుణంగా విఫలమయ్యాడు. కానీ ఐసీసీ టోర్నీలలో మంచి రికార్డు కలిగిన రోహిత్.. లీగ్ మ్యాచ్ల వరకూ కుదురుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఇక పొట్టి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు (1141) చేసిన కోహ్లీ పైనా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే స్పిన్నర్ల ప్రభావం ఉండనున్న యూఎస్ఎ, వెస్టిండీస్ ‘స్లో పిచ్’లపై ‘లెఫ్టార్మ్ స్పిన్నర్ల’ను కోహ్లీ ఏ మేరకు ఎదుర్కుంటాడన్నది ఆసక్తికరం. సుమారు 15 ఏండ్లుగా భారత జట్టుకు సేవలందిస్తున్న ఈ ఇద్దరి ‘ఆఖరి కల’ కోసం జట్టు కూడా సమిష్టిగా తోడ్పాటునందిస్తే ‘రోకో’ కలిసి మరోసారి ఐసీసీ విజేతగా నిలవడం పెద్ద కష్టమేమీ కాదు.
-నమస్తే తెలంగాణ క్రీడా విభాగం