‘ఆరెంజ్ ఆర్మీ అంటే సునామీ కచ్చితంగా తాట తీస్తామే’ అంటూ ఈ ఏడాది థీమ్ సాంగ్లో పాడుకున్నట్టే ప్రత్యర్థి జట్లపై రికార్డు స్కోర్లతో రెచ్చిపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) లీగ్ దశను మరో ‘హైస్కోరింగ్ థ్రిల్లర్’తో ముగించింది. ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి నిర్దేశించిన 215 పరుగుల టార్గెట్ను పెద్దగా కష్టపడకుండానే ఛే‘దంచేసి’ ఫ్యాన్స్కు ‘సూపర్ సండే’ను సిక్సర్లు, ఫోర్లతో విందు భోజనంగా వడ్డించింది. అభిషేక్ శర్మ, క్లాసెన్, త్రిపాఠి వీరవిహారం చేయడంతో పంజాబ్ బ్యాటర్లు ప్రభ్సిమ్రన్, రూసో, అథర్వ భారీ హిట్టింగ్లు వృథా అయ్యాయి. ఈ విజయంతో 8వ మ్యాచ్ గెలిచిన హైదరాబాద్ 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానం దక్కించుకోగా పంజాబ్ తొమ్మిదో స్థానంతో సీజన్ను ముగించింది.
SRH | హైదరాబాద్: ఐపీఎల్-2024లో భారీ స్కోర్లతో రెచ్చిపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశను ఘన విజయంతో ముగించింది. ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి నిర్దేశించిన 215 పరుగుల ఛేదనను మరో 5 బంతులు మిగిలుండగానే ఊదేసి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారీ ఛేదనలో అభిషేక్ శర్మ (28 బంతుల్లో 66, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారానికి తోడు హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 42, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (18 బంతుల్లో 33, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా రెచ్చిపోవడంతో 19.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రభ్సిమ్రన్ (45 బంతుల్లో 71, 7 ఫోర్లు, 4 సిక్సర్లు), రిలీ రూసో (24 బంతుల్లో 49, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. ఎస్ఆర్హెచ్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అభిషేక్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఛేదించాల్సిన లక్ష్యం తక్కువేమీ కాదు. అదీగాక ఈ సీజన్లో భీకరమైన ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్ తొలి బంతికే డకౌట్ అవడంతో ఛేదనలో సన్రైజర్స్ మళ్లీ తడబడుతుందా..? అన్న అనుమానం. కానీ లేక లేక జట్టులో స్థానం దక్కించుకున్న రాహుల్ త్రిపాఠి అండతో అభిషేక్ రెచ్చిపోయాడు. మేఘావృతమైన వాతావరణం ఎప్పుడైనా ఉప్పల్ను ముంచేయొచ్చన్న హెచ్చరికలతో ఈ ఇద్దరూ ఆదినుంచే బ్యాట్లకు పనిచెప్పారు. అర్ష్దీప్ తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన త్రిపాఠి.. రిషి ధావన్ రెండో ఓవర్లో 6, 4, 4 సాధించాడు. అర్షదీపే వేసిన 3వ ఓవర్లో బౌండరీతో బాదుడుకు శ్రీకారం చుట్టిన అభిషేక్.. అదే ఓవర్లో 4, 6తో తన ఉద్దేశాన్ని ఘనంగా చాటాడు. ఈ ఇద్దరి వీరవిహారంతో 5 ఓవర్లు ముగియకముందే హైదరాబాద్ 70 పరుగుల మార్కును దాటేసింది. హర్షల్ వేసిన ఈ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి త్రిపాఠి.. అర్ష్దీప్కు క్యాచ్ ఇచ్చాడు. కానీ నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి (25 బంతుల్లో 37, 1 ఫోర్, 3 సిక్సర్లు) అభిషేక్కు జతకలిశాడు. హర్షల్ 8వ ఓవర్లో రెండు ఫోర్లతో 21 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తిచేసిన అభిషేక్.. హర్ప్రీత్ 10వ ఓవర్లో 2 భారీ సిక్సర్లు కొట్టాడు. కానీ బౌలింగ్ మార్పుగా వచ్చిన శశాంక్ సింగ్.. 11వ ఓవర్లో అతడిని పెవిలియన్కు పంపాడు.
అభిషేక్ నిష్క్రమించినా హైదరాబాద్ బెదరలేదు. 12 ఓవర్లకే 150 పరుగుల మార్కును దాటిన ఎస్ఆర్హెచ్ను నితీశ్-క్లాసెన్ విజయం వైపు నడిపించారు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో నితీశ్ ఔట్ అయినా, షాబాద్ (3) నిరాశపరిచినా క్లాసెన్ క్రీజులో నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ విజయానికి 10 పరుగుల దూరంలో క్లాసెన్ ఔట్ అయినా సమద్ (11 నాటౌట్), సన్వీర్ (6 నాటౌట్) లాంఛాన్ని పూర్తిచేశారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్కు టాప్ – 3 బ్యాటర్లు రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు అథర్వ (27 బంతుల్లో 46, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రభ్సిమ్రన్.. ఓవర్కు 10 రన్ రేట్ తగ్గకుండా ఆడారు. తొలి వికెట్కు 9.1 ఓవర్లలోనే 97 పరుగుల జత చేసిన ఈ జోడీని ఎట్టకేలకు నటరాజన్ విడదీశాడు. అథర్వ నిష్క్రమించినా రూసో సాయంతో ప్రభ్సిమ్రన్ హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసిన అతడు.. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడాడు. వియస్కాంత్ బౌలింగ్లో అతడు ఔట్ కాగా, రూసోను కమిన్స్ పెవిలియన్కు పంపినా ఆఖర్లో పంజాబ్ తాత్కాలిక సారథి జితేశ్ శర్మ (32 నాటౌట్) 4,6,6 బాదడంతో ఆ జట్టు 210 పరుగుల మార్కును దాటింది.
రైజర్స్కు ఇది రెండో అత్యధిక ఛేదన. అంతకుముందు రాజస్థాన్పైనా 215 పరుగుల టార్గెట్ను విజయవంతంగా పూర్తిచేసింది.
ఈ మ్యాచ్లో 13 సిక్సర్లు కొట్టిన ఎస్ఆర్హెచ్ (160) ఇదే సీజన్లో ఆర్సీబీ (157) రికార్డును అధిగమించింది.
పంజాబ్: 20 ఓవర్లలో 214/5 (ప్రభ్సిమ్రన్ 71, రూసో 49, నటరాజన్ 2/33, కమిన్స్ 1/36).
హైదరాబాద్: 19.1 ఓవర్లలో 215/6 (అభిషేక్ 66, క్లాసెన్ 42, అర్ష్దీప్ 2/37, హర్షల్ 2/49).