పోరు కట్టిపడేసింది. పంజాబ్ కింగ్స్తో ముల్లాన్పూర్ వేదికగా ముగిసిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. బ్యాట్తో పాటు బంతితోనూ తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి వన్మెన్ షో తో మొదట భారీ స్కోరు సాధించిన హైదరాబాద్.. ఆ తర్వాత పంజాబ్ను విజయానికి 2 పరుగుల దూరంలో కట్టడి చేసింది. ఇటీవలే గుజరాత్ టైటాన్స్తో పోరులో ఓడిపోయే మ్యాచ్ను గెలిపించిన పంజాబ్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు గెలుపు కోసం చివరి బంతి దాకా పోరాడినా హైదరాబాద్దే పైచేయి అయింది.
ముల్లాన్పూర్: ఐపీఎల్-17లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ షో తో సత్తాచాటడంతో సన్రైజర్స్ హైదరాబాద్ గెలుపు జోరు కొనసాగించింది. ముల్లాన్పూర్ వేదికగా ఆద్యంతం ఉత్కంఠగా ముగిసిన పోరులో 2 పరుగుల తేడాతో పంజాబ్ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. నితీశ్ రెడ్డి (37 బంతుల్లో 64, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 25, 5 ఫోర్లు) రాణించారు. పంజాబ్ బౌలర్ అర్ష్దీప్ నాలుగు వికెట్ల (4/29)తో వణికించాడు. ఛేదనలో పంజాబ్ ఆరంభంలో తడబడ్డా శశాంక్ సింగ్ (25 బంతుల్లో 46 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్సర్), అశుతోష్ శర్మ (15 బంతుల్లో 33 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగుల వద్దే ఆగిపోయింది. బ్యాట్తో పాటు బంతితోనూ రాణించిన నితీశ్కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
రైజర్స్ తడబాటు..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్కు ఆరంభం లోనే ఎదురుదెబ్బలు తాకాయి. తొలి వికెట్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ (16), ట్రావిస్ హెడ్ (21)లు 3.2 ఓవర్లలోనే 27 పరుగులు జోడించినా అర్ష్దీప్ సింగ్, సామ్ కరన్లు ఎస్ఆర్హెచ్ను దెబ్బతీశారు. హెడ్ను అర్ష్దీప్ 4వ ఓవర్లో రెండో బంతికి ఔట్ చేశాడు. నాలుగో బంతికి మార్క్మ్ పరుగులేమీ చేయకుండానే వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. కరన్ ఐదో ఓవర్లో అభిషేక్ శర్మను బుట్టలో వేసుకోగా రాహుల్ త్రిపాఠి (11)ని హర్షల్ పటేల్ పెవిలియన్ చేర్చాడు.
నితీశ్ అదుర్స్..
10 ఓవర్లకు 66-4గా ఉన్న హైదరాబాద్.. పంజాబ్ ఎదుట 183 పరుగుల లక్ష్యాన్ని నిలిపిందంటే దానికి కారణం నితీశ్. హర్ప్రీత్ బ్రర్ వేసిన పదో ఓవర్లో 4,6 తో విధ్వంస రచనకు తెరతీసిన నితీశ్.. రబాడా, కరన్ ఓవర్లలోనూ బంతిని స్టాండ్స్లోకి పంపాడు. మరో ఎండ్లో అబ్దుల్ సమద్ అండతో అతడు మరింత రెచ్చిపోయాడు. బ్రర్ వేసిన 15వ ఓవర్లో అయితే అతడి విధ్వంసం తారాస్థాయికి చేరింది. రెండో బంతికి ఫోర్ బాదిన నితీశ్.. మూడో బంతికి సిక్సర్తో ఐపీఎల్లో తొలి అర్ధ సెంచరీని 32 బంతుల్లోనే పూర్తిచేశాడు. ఈ ఇద్దరి నాటుకొట్టుడుతో హైదరాబాద్ 11-16 ఓవర్ల మధ్య 80 పరుగులు రాబట్టింది. వీళ్ల దూకుడు చూస్తే ఒకదశలో హైదరాబాద్ 200 స్కోరు సాధించే దిశగా సాగినా హాఫ్ సెంచరీ తర్వాత నితీశ్ ఔట్ అవడం, సమద్ సైతం నిష్క్రమించడంతో 182 పరుగుల వద్దే ఆగిపోయింది.
మళ్లీ వాళ్లే..
భారీ ఛేదనలో పంజాబ్కూ ఆది నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. కమిన్స్ రెండో ఓవర్లోనే బెయిర్ స్టో (0)ను క్లీన్బౌల్డ్ చేయగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రభ్సిమ్రన్ సింగ్ (4) భువనేశ్వర్ బౌలింగ్లో నితీశ్ రెడ్డి సూపర్ క్యాచ్తో వెనుదిరిగాడు. ధవన్ (14) సైతం భువీ వేసిన ఐదో ఓవర్లో స్టంపౌట్ అయ్యాడు. కరన్(22) ను నటరాజన్ పెవిలియన్కు సాగనంపాడు. సికందర్ రజాను ఉనద్కత్ ఔట్ చేశాడు. 91 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినా పంజాబ్ శశాంక్ సింగ్, అశుతోశ్ లపై భారీ ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే ఈ ఇద్దరూ హైదరాబాద్ను భయపెట్టారు. భువీ వేసిన 17వ ఓవర్లో శశాంక్ 3 ఫోర్లతో 17 పరుగులు రాబట్టాడు. నటరాజన్ 19వ ఓవర్లోనూ 10 పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరం కాగా.. ఉనద్కత్ 26 పరుగులిచ్చాడు.
నితీశ్ శభాష్
ఆడుతున్నది రెండో ఐపీఎల్ సీజన్. 2023లో తుది జట్టులో చోటు దక్కకపోయినా ఈ సీజన్లో ఆడిన రెండో మ్యాచ్కే తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తా చాటాడు. రెండేండ్లుగా ‘ఒక్క అవకాశం’ కోసం వేచి చూసిన ఈ విశాఖ వాసి.. జట్టుకు అవసరమైన సమయంలో తెలుగోడి పవర్ చూపించాడు. ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్క్మ్,్ర హెన్రిచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠి వంటి హార్డ్ హిట్టర్లు విఫలమైన ముల్లాన్పూర్ స్టేడియంలో నేనున్నానని హైదరాబాద్కు వన్మెన్ ఆర్మీలా నిలిచాడు. పంజాబ్ బౌలర్లు విజృంభిస్తున్న వేళ బ్యాటింగ్కు వచ్చిన 20 ఏండ్ల నితీశ్.. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాడు. మొదట బౌలర్లను అర్థం చేసుకున్న అతడు.. కుదురుకున్నాక బాదుడుకు గేట్లు ఎత్తేశాడు. హైదరాబాద్ టాపార్డర్ను వణికించిన పంజాబ్ బౌలర్లకు ‘నా ముందు మీ ఆటలు సాగవు’ అంటూ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. నితీశ్.. మొదటి 18 బంతుల్లో చేసినవి 14 పరుగులే. కానీ ఇది తుఫాను ముందు ప్రశాంతతే. అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. తర్వాత 19 బంతుల్లో 50 పరుగులు రాబట్టాడు. ఇందులో 3 బౌండరీలు, 6 సిక్సర్లున్నాయి. మనోడి కొట్టుడుకు పంజాబ్ బౌలర్ హర్ప్రీత్ బ్రర్కు మైండ్ బ్లర్ అయిపోయింది. అతడు వేసిన 15వ ఓవర్లో 22 పరుగులు
రాబట్టాడు. సిక్సర్తో ఫిఫ్టీ పూర్తిచేసిన నితీశ్.. అంతర్జాతీయ క్రికెట్లో ప్రమాదకర బౌలర్లుగా ఉన్న రబాడా, కరన్లనూ వదల్లేదు.
బ్యాటింగ్లో దుమ్మురేపిన నితీశ్.. బంతితోనూ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు వేసిన అతడు 33 పరుగులిచ్చి పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ వికెట్ తీశాడు. అంతేగాక భువనేశ్వర్ బౌలింగ్లో రన్నింగ్ క్యాచ్తో ప్రభ్సిమ్రన్ ఆట కట్టించాడు. చెన్నైతో మ్యాచ్లో 8 బంతుల్లో 14 పరుగులు చేసిన నితీశ్.. పంజాబ్తో మాత్రం ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రాబోయే మ్యాచ్లలోనూ నితీశ్ ఇదే ప్రదర్శన కొనసాగిస్తే సన్రైజర్స్ టీమ్లో తెలుగు ఆటగాళ్లు లేని కొరత తీర్చినట్టే..
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్ : 20 ఓవర్లలో 182-9 (నితీశ్ 64, సమద్ 25, అర్ష్దీప్ 4/29, హర్షల్ 2/30) పంజాబ్ : 20 ఓవర్లలో 180-6 (శశాంక్ 46 నాటౌట్, అశుతోష్ 33 నాటౌట్, భువనేశ్వర్ 2/32, నటరాజన్ 1/33)