Sunil Gavaskar : ప్రపంచ క్రికెట్పై భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) చెరగని ముద్ర వేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించిన మాస్టర్ బ్లాస్టర్ ఆటకు ఫిదా అవ్వని అభిమాని లేడు. అందుకనే వరల్డ్ కప్ సందర్భంగా బీసీసీఐ(BCCI) క్రికెట్ గాడ్ జ్ఞాపకార్థం ముంబైలోని వాంఖడే స్టేడియం(Wankhade Stadium)లో సచిన్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసింది. అయితే.. సచిన్ పేరుతో ఏకంగా ఒక రైల్వే స్టేషనే ఉందనే విషయం చాలామందికి తెలియదు.
తాజాగా భారత దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ఆ స్టేషన్ను అందరికీ పరిచయం చేశాడు. ఈమధ్యే అక్కడ దిగిన ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. గుజరాత్లోని సూరత్కు సమీపంలో సచిన్ రైల్వే స్టేషన్ ఉంది. గత శతాబ్దపువాళ్లది ఎంత ముందుచూపో. క్రికెట్లో ఆల్టైమ్ గ్రేట్, నా ఫేవరేట్ క్రికెటర్, మరీ ముఖ్యంగా నాకెంతో ఇష్టమైన వ్యక్తి పేరును ఒక రైల్వే స్టేషన్కు పెట్టారు అని గవాస్కర్ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ మరెవరికీ సాధ్యం కాని రీతిలో వంద సెంచరీలు బాదాడు. ముఖ్యంగా తనకు ఎంతో అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్లో రికార్డు స్థాయిలో 49 శతకాలు, 96 అర్ధ శతకాలు బాదాడు. అంతేకాదు వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ(Double Century) కొట్టింది కూడా సచినే. 2010లో దక్షిణాఫ్రికా(South Africa)పై శివాలెత్తిన మాస్టర్ బ్లాస్టర్ 200 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
గవాస్కర్, సచిన్
2013లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీ మెంటార్గా సేవలందిస్తున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) ఇదే జట్టు తరఫున బరిలోకి దిగాడు. దాంతో, ఒకే ఐపీఎల్ జట్టుకు ఆడిన మొదటి తండ్రీకొడుకులుగా సచిన్, అర్జున్ రికార్డు సృష్టించారు.