MS Dhoni : ఐపీఎల్ 2024 మినీ వేలానికి కొన్ని రోజులే ఉంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అందరూ ఊహించినట్టుగానే చెన్నై సూపర్ కింగ్స్(CSK) లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)ని రీటైన్ చేసుకుంది. దాంతో, ఈ స్టార్ ఆటగాడి బ్యాటింగ్ విన్యాసాలను మరోసారి కళ్లారా చూడొచ్చని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే.. 42 ఏండ్లు దాటిన మహీ భాయ్ ఈసారి టోర్నీ మొత్తం ఆడతాడా? లేదా? అనే సందేహం కొందరికి ఉంది. ధోనీ 17వ సీజన్ ఐపీఎల్ ఆడడంపై భారత జట్టు మాజీ కోచ్ అనిల్ కుంబ్లే(Anil Kumble) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘సీఎస్కే జట్టు సభ్యులతో పాటు అభిమానులు ధోనీ ఆడాలని కోరుకుంటున్నారు. అయితే. ధోనీ తన శరీరకంగా, మానసికంగా సిద్ధపడితేనే సీజన్ మొత్తం మైదానంలోకి దిగగలడు’ అని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ధోనీకి ప్రస్తుతం 42 ఏండ్లు. పైగా 16వ సీజన్ ఫైనల్ తర్వాత అతడు మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. గాయం నుంచి కోలుకుంటున్న మహీ.. 17వ సీజన్లో ఆడినా.. ఫిట్నెస్ కాపాడుకొని ఏ మేరకు రాణిస్తాడు? అనేది పెద్ద ప్రశ్న.
టీమిండియా గొప్ప కెప్టెన్లలో ధోనీ పేరు ముందువరసలో ఉంటుంది. అతడి సారథ్యంలోనే భారత్ ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీ(2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ)లు గెలిచింది. అయితే.. 2019 వరల్డ్ కప్తో ధోనీ కెరీర్కు బ్రేక్ పడింది. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో ధోనీ రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ క్షణమే ఆటకు రిటైర్మెంట్ ఇవ్వాలని మహీ అనుకున్నాడు. అయితే.. 2020 ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతానికి ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రమే ఆడుతున్నాడు. 16వ సీజన్లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. యువకులతో నిండిన జట్టును ఫైనల్కు చేర్చిన మహీ.. టైటిల్ పోరులో తన వ్యూహాలతో గుజరాత్ టైటన్స్కు చెక్ పెట్టాడు.