Sunil Gavaskar : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అయిపోయింది. మరో 8 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సందడి మొదలవ్వనుంది. సొంత గడ్డపై ఫ్యాన్స్ను అలరించేందుకు సిద్ధమవుతున్న భారత క్రికెటర్లను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar హెచ్చరించాడు. ఐపీఎల్ మాయలో పడి ఆసీస్ చేతిలో ఓటమిని మర్చిపోవద్దని ఆయన అన్నాడు.
‘మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ షురూ అవుతుంది. అయితే.. ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ ఓటమిని భారత ఆటగాళ్లు మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోతే పెద్ద పొరపాటు చేసినట్టే. ఎందుకంటే..? ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్ కప్(ODI WC 2023)లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడే అవకాశం ఉంది. అందుకని వన్డే సిరీస్లో ఓటమిని తేలికగా తీసుకోవద్దు’ అని రోహిత్ సేనకు గవాస్కర్ సూచించాడు.
అంతేకాదు మూడో వన్డేలో ఆసీస్ బౌలర్లు భారత్పై ఒత్తిడి పెంచారని, అందుకని బౌండరీలు రావడం, సింగిల్స్ తీయడం కష్టమైందని ఈ మాజీ క్రికెటర్ అన్నాడు. అలాంటప్పుడు బ్యాటర్లు కొత్త షాట్లు ఆడాలని ఆయన తెలపాడు. మూడు వన్డేల సిరీస్ను ఆసీస్ 2-1తో కైవసం చేసుకుంది. దాంతో, భారత జట్టు సొంత గడ్డపై నాలుగేళ్ల తర్వాత వన్డే సిరీస్ కోల్పోయింది. 2019లో ఆస్ట్రేలియా 3-2తో సిరీస్ దక్కించుకుంది. ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ మధ్య వన్డే వరల్డ్ కప్ భారత్లో జరగనుంది. 2011లో సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఉంది. ఇప్పటికే బీసీసీఐ 20 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసిన విషయం తెలిసిందే.
భారత్, ఆస్ట్రేలియా జట్లు ఈ ఏడాది ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) ఫైనల్లో తలపడనున్నాయి. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ పోరు ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియం వేదిక జూన్ 7న ప్రారంభం కానుంది. తొలి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా ఈసారి టెస్టు గదపై గురి పెట్టింది. మొదటిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆసీస్ కూడా చాంపియన్షిప్ టైటిల్ నెగ్గాలని గట్టి పట్టుదలతో ఉంది.