Sunil Gavaskar : టెస్టు గద ఫైట్(WTC Final 2023) దగ్గర పడుతున్న కొద్దీ విజేతగా నిలిచేది ఎవరు? అనే చర్చలు జోరందుకున్నాయి. భారత్, ఆస్ట్రేలియా జట్ల బలాబలాలు, జట్టు ఎంపిక గురించి మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar) ఫైనల్కు తుది జట్టును ప్రకటించాడు. అందులో ఎవరెవరు ఉన్నారు? వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్ ఏంటీ…? అనేది కూడా వివరించాడు.
రోహిత్ శర్మకు జోడీగా శుభ్మన్ గిల్ పేరు సూచించాడు. మిడిలార్డర్లో ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేకు చోటిచ్చాడు. ఆ తర్వాత.. శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, షమీ, సిరాజ్, శార్ధూల్ ఠాకూర్ బ్యాటింగ్కు వస్తారని గావస్కర్ చెప్పాడు.
గావస్కర్ తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్) శుభ్మన్ గిల్, ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, షమీ, సిరాజ్, శార్ధూల్ ఠాకూర్.
ఓవల్ స్టేడియంలో జూన్ 7 -11 మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్లు తొలిసారి తలపడుతున్న టెస్టు ఇది. దాంతో, ఫైనల్ హోరాహోరీగా ఉండనుంది. 2021లో ఫైనల్ చేరిన టీమిండియా న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. దాంతో, టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ప్యాట్ కమిన్స్ సేనను భారత జట్టు ఓడించింది. దాంతో, ఫైనల్లో కూడా అదే ఫలితం రాబట్టాలని రోహిత్ బృందం భావిస్తోంది.