గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్ తో జట్టుకు భారంగా మారుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని జట్టులో ఉంచాలా..? తొలగించాలా..? అన్నదానిపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తున్నది. తాజాగా విండీస్ తో వన్డే సిరీస్ కు అతడికి విశ్రాంతినివ్వడం కూడా చర్చనీయాంశమైంది. అయితే విరాట్ ఒక్కడే కాదు.. టీమిండియా సారథి రోహిత్ శర్మ కూడా పరుగులు చేయడం లేదని, మరి అతడి సంగతేంటని ప్రశ్నిస్తున్నాడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.
గవాస్కర్ మాట్లాడుతూ.. ‘అందరూ కోహ్లీ ఫామ్ గురించే మాట్లాడుతున్నారు. నాకైతే ఒక విషయం అర్థం కావడం లేదు. కోహ్లీ సరే.. మరి రోహిత్ కూడా పరుగులు చేయడంలేదు కదా. అతడితో పాటు జట్టులోని పలువురు ఆటగాళ్లు చాలా సందర్భాల్లో విఫలమవుతున్నారు. మరి వారినేమంటారు..? టీమిండియా ప్రస్తుతం అవలంభిస్తున్న అటాకింగ్ ఆటతీరుతో బ్యాటింగ్ చేసే క్రమంలో ఆటగాళ్లు అప్పుడుప్పుడు విఫలమవుతూనే ఉంటార’ని సన్నీ నొక్కి చెప్పాడు..
టీ20 జట్టులో కోహ్లీని తీసుకోవద్దని వస్తున్న వాదనలను కూడా సన్నీ కొట్టిపారేశాడు. టీ20 టోర్నీకి జట్టును ప్రకటించడానికి ఇంకా రెండు నెలల దాకా సమయముంది. ఆసియా కప్ లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి అప్పుడు జట్టును నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడే ఆటగాళ్ల మీద టీ20 ప్రపంచకప్ గన్ ను పెట్టొద్దు..’ అని తెలిపాడు.
ఇంగ్లండ్ తో మూడు వన్డేలలో కోహ్లీ తన పాత లయను అందుకోవడానికి దోహదపడతాయని గవాస్కర్ అన్నాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి కొన్ని బంతులు తీసుకుని పరిస్థితులను అర్థం చేసుకోగలిగితే కోహ్లీకి ఎదురులేదని చెప్పాడు. కోహ్లీకి ఇది (వన్డే) గొప్ప ఫార్మాట్ అని తాను భావిస్తున్నాని సన్నీ వివరించాడు.