ఆటలతో సందడిగా మారిన మైదానాలు
హైదరాబాద్, ఆట ప్రతినిధి/ సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వేసవి క్రీడా శిక్షణాశిబిరాలకు తెరలేచింది. సోమవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్రీడా శిబిరాలను అధికారికంగా ప్రారంభించారు. చాదర్ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్ వేదికగా జరిగిన ప్రారంభం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈనెల 25న మొదలైన సమ్మర్ క్యాంప్లు వచ్చే నెల 31 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ‘నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగేందుకు ఆటలు దోహదపడుతాయి.
చిన్నతనంలోనే పిల్లల్లో ప్రతిభను గుర్తించడం ద్వారా మెరికల్లాగా తీర్చిదిద్దేందుకు అవకాశం లభిస్తుంది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత కొన్నేండ్లు శిబిరాలకు అవాంతరాలు ఏర్పడ్డాయి’ అని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న క్రీడా మైదానాల్లో ఆరు నుంచి 16 ఏండ్ల లోపు పిల్లలకు అత్యుత్తమ శిక్షణ అందించనున్నారు. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు చేసిన మార్చ్ఫాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సరోజ, జోనల్ కమిషనర్ రవికిరణ్, స్పోర్ట్స్ అధికారి బాషా, జాయింట్ కమిషనర్ యాదయ్య, గేమ్స్ ఇన్స్పెక్టర్ మాధవి, గన్ఫౌండ్రీ, గోషామహల్ కార్పొరేటర్లు సురేఖ, లాల్సింగ్ పాల్గొన్నారు.