క్రికెట్ కు సంబంధించిన విషయాలపై నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలతో అందరికీ షాకిచ్చాడు. రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ ల వల్ల ఒరిగేదేమీ లేదని, వాటిని తగ్గించి ఐపీఎల్ ను రెండు సీజన్లుగా ఆడాలని శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ద్వైపాక్షిక సిరీస్ లు దండగ వ్యవహారమని.. వాటికి బదులు టీ20 ప్రపంచకప్ ఒకటి ఆడి వాటిని వీలైనంత తగ్గించడమే మంచిదని.. ఆ దిశగా క్రికెట్ బోర్డులు ఆలోచన చేయాలని వ్యాఖ్యానించాడు. అదే భవిష్యత్ అని శాస్త్రి పునరుద్ఘాటించాడు.
తాజాగా రవిశాస్త్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘భవిష్యత్ అంతా అదే (ఒక సంవత్సరంలో రెండు ఐపీఎల్ సీజన్లు).. రాబోయే రోజుల్లో ఐపీఎల్ లో మనం రెండు సీజన్లలో 140 మ్యాచులు (70-70) చూడొచ్చు. అది అలాగే కొనసాగాలి. టీ20 క్రికెట్ లో ఇరు దేశాల మధ్య చాలా ద్వైపాక్షిక సిరీస్ లు జరుగుతున్నాయి..
నేనింతకు ముందే చెప్పాను. నేను టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు కూడా భారత జట్టు వందలాది టీ20 మ్యాచులు ఆడింది. వాటిలో నాకు ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గుర్తులేదు. ఒకవేళ ప్రపంచకప్ గెలిస్తే దానినేమైనా గుర్తు పెట్టుకునేవాళ్లమేమో. కానీ దురదృష్టవశాత్తూ మనం గెలవలేదు. దేశాల మధ్య టీ20 క్రికెట్ మరీ ఎక్కువగా ఆడుతున్నారు. అంత అవసరం లేదు. ఫ్రాంచైజీ క్రికెట్ సరిపోతుంది..
క్రికెట్ లో కూడా ఫుట్బాల్ మోడల్ రావాలి. ఫుట్బాల్ లో చూస్తే మీరు ప్రపంచకప్ మాత్రమే వారి దేశం తరఫున ఆడతారు. ఆ తర్వాత మరికొన్ని కీలక టోర్నీలు.. అంతే. మిగతాదంతా ఫ్రాంచైజీలకే ప్రాతినిథ్యం వహిస్తారు. ఆ విధానం టీ20 క్రికెట్ లో కూడా రావాలి. ప్రతి దేశం వారి ఆటగాళ్లను ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటానికి అనుమతినివ్వాలి.. ప్రతి రెండేళ్లకోమారు టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తే సరిపోతుంది..’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. మరి శాస్త్రి ప్రతిపాదనపై బీసీసీఐతో పాటు ఇతర బోర్డులు, ఐసీసీ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.